అనూష ఆత్మహత్య: "నీ అందానికి అంతకన్నా ఎక్కువా?"
ఒంగోలు: ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని బీవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని అనూష ఆత్మహత్యకు సంబంధించి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మాలకొండారెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. కళాశాల హెచ్ఓడీ వేధింపులే అనూష ఆత్మహత్యకు కారణమని ఆమె బంధువులు ఆరోపించారు.
కాలేజీలో ఇటీవల అనూషకు హెచ్ఓడీ మాలకొండా రెడ్డికి ఘర్షణ జరిగిందని, ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారని అంటున్నారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి మాలకొండారెడ్డి అందరి ముందు అనూషను అవమానపరిచేవాడని అన్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు.

తన చావుకు మాలకొండా రెడ్డే కారణమని అనూష తన డైరీలో రాసినట్లు తెలియవచ్చింది. డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం బయటకు రాకుండా ఉండేందుకు కాలేజీ యాజమాన్యం తన ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో విద్యార్థులు మండిపడుతూ అనూషకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ రోడ్డుమీద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అనూష రాసిన డైరీలోని విషయాలు ఇంతవరకు బయటపెట్టలేదు.
మార్కుల విషయంలో హెచ్ఓడీ మాలకొండారెడ్డితో అనూష మాట్లాడగా నీ మొహానికి అంతకంటే ఎక్కువ మార్కులు వస్తాయా అని అన్నారని, ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి, బాధపడిన అనూష హెచ్ఓడీని ఒక దెబ్బ కొట్టినట్లు తెలిసిందని ఆమె బంధువు ఒకరు అన్నారు.
హెచ్ఓడీ ఎంత ఇబ్బంది పెట్టకపోతే విద్యార్థి చేయి చేసుకుందన్న విషయం అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. హెచ్ఓడీ అనూషను మానసికంగా చాలా వేధించాడని, వాటిని తట్టుకోలేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications