ప్రేమ పెళ్లి: ‘ఏమీ అనమంటూ’ ఇంటికి పిలిచి అల్లుడిని హతమార్చాడు
అనంతపురం: సమాజంలో కొందరు మూర్ఖులకు ప్రాణం కంటే పరువే ముఖ్యమవుతోంది. తమ పరువు పోతోందనే నెపంతో ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడిని.. యువతి తండ్రి దారుణంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా నల్లమాడ మండలం బడవాండ్లపల్లిలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

ఏమీ అనమంటూ ఇంటికి పిలిచారు..
వివరాల్లోకి వెళితే.. బడవాండ్లపల్లికి చెందిన భార్గవి అదే గ్రామానికి చెందిన ధనుంజయతో కలిసి ఏడు నెలల క్రితం గ్రామం నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వారి ఆచూకీ తెలుసుకున్న భార్గవి తల్లి కాటమ్మ.. ‘జరిగిందేదో జరిగిపోయింది.. ఇక మిమ్మల్ని ఏమీ అనం.. ఇంటికి రండి' అంటూ ఇటీవల కూతురు, అల్లుడిని ఆహ్వానించింది. దీంతో భార్గవి, ధనుంజయ పదిరోజుల క్రితం గ్రామానికి వచ్చారు.

అనుమానం వచ్చినా.. భార్గవి పిలుపుతో..
అత్తంటిలోనే ఉంటున్న ధనుంజయకు భార్గవి తండ్రి గిరిబాబు ప్రవర్తన మీద అనుమానం కలిగింది. దీంతో భయపడి కదిరి మండలం కాళసముద్రంలోని అక్క వద్దకు వెళ్లిపోయాడు. అయితే భార్గవి ధనుంజయకు ధైర్యం చెప్పి తమ తల్లిదండ్రులు ఏమీ అనరని ఇంటికి రమ్మని నచ్చజెప్పింది. దీంతో ధనుంజయ రెండ్రోజుల క్రితం మళ్లీ అత్తవారింటికి వెళ్లాడు.

ధనుంజయను దారుణంగా..
కాగా, కూతురి ప్రేమపెళ్లి ఏమాత్రం ఇష్టం లేని భార్గవి తండ్రి.. ధనుంజయపై కోపంతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంట్లో ఉన్న ఈటతో ధనుంజయ గొంతులో పొడిచి దారుణంగా హతమార్చాడు. అడ్డుకున్న భార్గవి కూడా స్వల్పంగా గాయపడింది. అనంతరం గిరిబాబు అక్కడి నుంచి పారిపోయాడు.

నిందితుడి కోసం గాలింపు..
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న గిరిబాబు కోసం గాలిస్తున్నారు. కాగా, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని ధనుంజయ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications