వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..!!
వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ హత్యకు కుటుంబ వివాదాలే కారణమంటూ దేవిరెడ్డి శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు. సీబీఐ తీరును తప్పుబడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం తులసమ్మ వాంగ్మూలం స్వీకరించింది. ఇందులో పలు కీలక అంశాలను కోర్టు ముందు నివేదించారు. ప్రధానంగా వివేకా కుటుంబ సభ్యుల ప్రమేయంతో పాటుగా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పైన ఆరోపణలు చేసారు.

మాజీ మంత్రి ఆదికి ఎందుకు చెప్పారు..
వైఎస్ వివేకా హత్య కేసు ఆసక్తి కర మలుపులు తిరుగుతోంది. శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ ఇచ్చిన వాంగ్మూలంలో వైఎస్ వివేకారెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే హత్యకు దారి తీశాయని పేర్కొన్నారు. రెండో భార్య షమీమ్కు ఆస్తిలో వాటా ఇస్తాననడంతోపాటు ఆమె కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తానని చెప్పడం ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆందోళన మొదలైందని వివరించారు.
వివేకా రాజకీయ, కుటుంబ వారసత్వాన్ని ఆశిస్తున్న నర్రెడ్డి రాజశేఖరెడ్డి, శివప్రకాశ్రెడ్డే ఆయన హత్యకు కుట్రపన్నారని ఆరోపించారు. హత్య అనంతరం వివేకా కుటుంబ సభ్యుల ప్రవర్తన సందేహాస్పదంగా ఉందని తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. వివేకా చనిపోయిన విషయాన్ని ఆయన పీఏ కృష్ణా రెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారని గుర్తు చేసారు. హత్య జరిగిన తరువాత వివేకా గుండెపోటుతో మరణించారని శివప్రకాశ్రెడ్డి ఎందుకు చెప్పారని అనుమానం వ్యక్తం చేసారు. అదికూడా వైఎస్సార్సీపీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆదినారాయణరెడ్డికి ఎందుకు చెప్పారని తన వాంగ్మూలంలో సందేహించారు.

టీడీపీ ఎమ్మెల్సీ ప్రమేయం పైనా..
వివేకానందరెడ్డి ఉన్నంతకాలం పులివెందుల నియోజకవర్గంలో తాను ఆధిపత్యం సాధించలేనని టీడీపీ నేత బీటెక్ రవికి తెలుసని పేర్కొన్నారు. అందుకే అడ్డు తొలగించుకునేందుకు వివేకా హత్యకు సహకరించారని ఆరోపించారు. వివేకానందరెడ్డికి ఆయన అనుచరుడిగా ఉన్న కొమ్మా పరమేశ్వరరెడ్డికి మధ్య ఆర్థికపరమైన విభేదాలు తలెత్తాయని వివరించారు. దాంతో పరమేశ్వరరెడ్డి కక్ష పెంచుకుని వివేకా రాజకీయ ప్రత్యర్థి బీటెక్ రవికి సన్నిహితుడిగా మారారని చెప్పుకొచ్చారు. 2019 మార్చి 14 సాయంత్రం కడపలోని హరిత హోటల్లో సాయంత్రం 6.30 గంటలకు ఒకసారి, 7.05 గంటలకు మరోసారి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో సమావేశమయ్యాడని వివరించారు.
ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తరువాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందారని పేర్కొన్నారు. వివేకాపై కక్షగట్టిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్రెడ్డి హైదరాబాద్లో వైజీ రాజేశ్వరరెడ్డితో భేటీ అయి హత్యకు కుట్ర పన్నారన్నారు. బీటెక్ రవి, పరమేశ్వరెడ్డిలు వారికి సహకరించారని ఆరోపించారు. పులివెందులకు చెందిన నీరుగుట్టు ప్రసాద్ ఆ కుట్ర అమలులో వారికి సహకరించారని చెప్పకొచ్చారు.

సీబీఐ ఉద్దేశపూర్వకంగా..
సీబీఐ ఉద్దేశపూర్వకంగానే ఈ కేసు దర్యాప్తును తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్గా మార్చడం, ముందస్తు బెయిల్ను వ్యతిరేకించకపోవడం సీబీఐ దురుద్దేశాలను వెల్లడిస్తున్నాయని వివరించారు. కేసుకు సంబంధించి సిట్ బృందాలు గతంలో దర్యాప్తులో గుర్తించిన కీలక విషయాలను సీబీఐ ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తోందని చెప్పారు. కేసును పక్కదారి పట్టించేందుకు దర్యాప్తు, అరెస్టులతో నిరపరాధులను వేధిస్తోందని పేర్కొన్నారు.
ఈ కేసులో అనేక చీకటి కోణాలు ఉన్నాయి. కాబట్టి కేసు దర్యాప్తు నిజాయితీగా సాగాలని కోరారు. వివేకానందరెడ్డి హత్య కుట్రలో భాగస్వాములైన ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాష్ రెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవి, పరమేశ్వరరెడ్డి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగట్టు ప్రసాద్లను విచారించాలన్నారు.












Click it and Unblock the Notifications