విభజన కోపంతోనే రాజకీయాల్లోకి: సినీ నటి హేమ
తూర్పుగోదావరి: తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సినీ నటి హేమ చెప్పారు. జై సమైక్యాంధ్ర పార్టీ తరపున తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట శాసనసభ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నట్లు హేమ తెలిపారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎంపి హర్షకుమార్ ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
హర్షకుమార్ వెంట హేమ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హేమ మాట్లాడుతూ.. మండపేట అసెంబ్లీ నియోజక వర్గం నుంచి తాను జై సమైక్యాంధ్ర పార్టీ తరపున ఏప్రిల్ 19న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
సమైక్యాంధ్ర పరిరక్షణే స్ఫూర్తిగా తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు హేమ చెప్పారు. ఇప్పటివరకూ తాను రాజకీయాల్లోకి రావాలనుకోలేదని, ఏకపక్షంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీపై కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హేమ తెలిపారు.
కాలక్షేపం కోసం తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదనీ, ప్రజలకు సేవ చేయాలన్న దృఢ సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. తనను ఎన్నుకుంటే మండపేటలోనే నివాసం ఉంటానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. తన స్వగ్రామం రాజోలు అని చెప్పిన హేమ, జిల్లా ప్రజలతో తనకు సత్సంబంధాలున్నాయని తెలిపారు.