రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ, టీడీపీలోకి వెళ్లను: జగన్ వెంటేనని విశ్వరూప్
తూర్పుగోదావరి: తాను తెలుగుదేశంలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు. శుక్రవారం అమలాపురంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలను అయినా వదులుకుంటాను గానీ, వైసీపీని మాత్రం వీడనని తేల్చి చెప్పారు.
తాను వైసీపీ నుంచి బయటకు వస్తానని, టీడీపీ నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు మైంగ్ గేమ్ ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలతో తాను ఏనాడూ సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశారు.
ఇటువంటి దుష్ప్రచారం వల్ల తమ పార్టీ కేడర్ మానసికంగా ఇబ్బంది పడుతోందని విశ్వరూప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలను ఆయన కోరారు.
వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు విడదీయరాని సంబంధం ఉందని విశ్వరూప్ చెప్పారు. అంతేగాక, ఒకవేళ తాను రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నా వైసీపీకి విధేయుడిగానే ఉంటానని విశ్వరూప్ స్పష్టం చేశారు.