తెలంగాణ స్పూర్తితో రాయలసీమ కోసం ఉద్యమించండి, పూర్తి మద్దతిస్తా: గద్దర్
తెలంగాణ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని రాయలసీమ వాసులు కూడ వనరుల్లో వాటా కోసం, హక్కుల కోసం పోరాడాలని ప్రజా యుద్దనౌక గద్దర్ రాయలసీమవాసులకు పిలుపునిచ్చారు.
కడప: తెలంగాణ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని రాయలసీమ వాసులు కూడ వనరుల్లో వాటా కోసం, హక్కుల కోసం పోరాడాలని ప్రజా యుద్దనౌక గద్దర్ రాయలసీమవాసులకు పిలుపునిచ్చారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలకులు మారినా, కానీ, పాలసీలు మాత్రం మారలేదని ప్రజా గాయకుడు గద్దర్ అభిప్రాయపడ్డారు. మెజారిటీకే రాజ్యధికారం పేరిట ఆదివారం నాడు కడపలో జరుగుతున్న జాతీయస్థాయి సదస్సుకు హజరయ్యేందుకు ఆయన కడపకు వచ్చారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ 90 శాతం ప్రజలు జీవనరేఖలో ఎలాంటి మార్పులు రాలేదన్నారు. రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు.
తాము పండించిన పంటను రైతులు విక్రయించే రోజులు రావాల్సిన అవసరం ఉందన్నారు గద్దర్. రైతుల పోరాటానికి తాము అండగా నిలుస్తామన్నారాయన.

తెలంగాణ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకొని పోరాటం చేయండి
తెలంగాణ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకొని పోరాటం చేయాలని ప్రజాయుద్ద నౌక గద్దర్ రాయలసీమవాసులకు సూచించారు.రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ ప్రాంతం మరీ వెనుకబడిన ప్రాంతమన్నారు.రాయలసీమలో వనరులకు ఎలాంటి లోటు లేదన్నారు. పాలకుల అశ్రద్ద వెనుకబడిన ప్రాంతంగా హక్కుల కోసం పోరాడాలన్నారు.రాయలసీమవాసులు తమ హక్కుల కోసం పోరాడే ఏ ఉద్యమానికైనా తన మద్దతు ఉంటుందని చెప్పారు.

ఆరు మాసాలపాటు కడప జిల్లాలో గడిపాను
తాను మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలోనే 1973 ప్రాంతంలో కడప జిల్లాలో ఆరుమాసాలపాటు గడిపానని ఆయన గుర్తుచేసుకొన్నారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతాల్లో గడిపినట్టు ఆయన గుర్తుకు తెచ్చుకొన్నారు. జిల్లా గురించి రాసిన గేయాలను ఆయన పాడి విన్పించారు.మార్కిస్టు ఉద్యమానికి తాను దూరం కాలేదన్నారు.

రాజ్యాధికారం దక్కాలంటే ఓటును ఆయుధంగా మార్చాలి
దేశంలో ఓట్ల ఉద్యమం రావాల్సిన అవసరం ఉందన్నారు గద్దర్. రాజ్యాంగం కల్పించిన గొప్పవరం ఓటుహక్కు అన్నారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కాలంటే సామాన్యుడు ఓటుశక్తిని రాజకీయశక్తిగా మార్చాలని ఆయన సూచించారు. జనాభాలో 65 శాతం ఉన్న యువత ముందుకు వచ్చి పోరాటం చేయాలన్నారు.

గద్దర్ విస్తృతంగా పర్యటన
మావోయిస్టు పార్టీకి దూరమైన తర్వాత ఆయన ఓటుహక్కుపై ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక పునర్నిర్మాణంలో కీలకంగా వ్యవహరించనున్నారు. అంతేకాదు త్వరలోనే భువనగిరి వేదికగా సభను నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడ ఆయన విస్తృతంగా పర్యటించనున్నారు.












Click it and Unblock the Notifications