ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపిదే విజయం...2019 ఎన్నికల్లో పోటీ చేస్తా:సబ్బం హరి
Recommended Video
విశాఖపట్టణం:ఎపి అసెంబ్లీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీదే విజయమని మాజీ ఎంపీ సబ్బం హరి విశ్లేషించారు. ఆదివారం విశాఖ జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలు, అభిమానుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రతిపక్షాలు చంద్రబాబు కన్నా మంచి నాయకత్వం ఇస్తామన్న భరోసాను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యాయని సబ్బంహరి చెప్పుకొచ్చారు. అందువల్లే అనుభవశాలిగా, పాలనపై పట్టున్న వ్యక్తిగా చంద్రబాబుకే ప్రజలు పట్టం కడతారని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ కుక్కలు చింపిన విస్తరిగా తయారైందని, పార్లమెంట్లో ప్రజాసామ్యానికి చోటు లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సుమారు నాలుగేళ్ల నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అనకాపల్లి మాజీ ఎంపి సబ్బం హరి తన రాజకీయ పునఃప్రవేశంపై తీసుకోబోయే నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం రోలుగుంట మండలం కంచుగుమ్మల పంచాయతీ శివారు భోగాపురంలో తన అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరి మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తుపై ఇప్పటికే విశాఖ నగరంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, గ్రామీణ ప్రాంతానికి సంబంధించి రోలుగుంట మండలం భోగాపురం నుంచే శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం సరైందని కాదని తాను మొదట్లోనే వ్యతిరేకించానన్నారు. అందుకు పర్యావసనం 2014 ఎన్నికలో ప్రజల నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎదుర్కొనాల్సి వచ్చిందన్నారు. ఏపీలో బీజేపీ ఉనికే లేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయం, మోసాల గురించి ప్రజలకు వివరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నూటికి నూరుశాతం సఫలమయ్యారన్నారు. ప్రధాని మోడీ గ్రాఫ్ దారుణంగా పడిపోతుందని, బీజేపీకి ప్రజాదరణ తగ్గిపోతున్నదని సబ్బం హరి తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లోపం ఉందన్నారు. అందుకు కారణాలు అనేకం ఉన్నాయని హరి వివరించారు.
2019లో జరిగే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని సబ్బం హరి వెల్లడించారు. అయితే తాను ఏ పార్టీ తరపున పోటీ చేస్తాననేది త్వరలోనే తెలియజేస్తానన్నారు. అయితే అంతకంటే ముందు రెండు నెలలపాటు జిల్లా అంతటా పర్యటించి, తన అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తానని సబ్బం హరి తెలిపారు. ఆ తరువాతే ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుని వెల్లడిస్తానన్నారు. అంతకు ముందు సబ్బం హరికి గ్రామంలోని నాయకులు, మహిళలు పూలమాలతో స్వాగతం పలికారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బండారు శ్రీనివాసరావు, బోళెం నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.