ఐఐటి మద్రాస్లో ఏపీ విద్యార్థి ఆత్మహత్య, అక్రమ సంబంధం వద్దన్నందుకు ప్రేయసిని చంపాడు
ఏలూరు/విజయవాడ: ఐఐటీ మద్రాసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన నాగేంద్ర కుమార్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఐటీ మద్రాసులో ఎంటెక్ సెకండియర్ చదువుతున్నాడు. అతను తన హాస్టల్ గదిలో సోమవారం సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయాడు.
వినాయక చవితి సందర్భంగా కొద్ది రోజుల క్రితం నాగేంద్ర కుమార్ తన తల్లిదండ్రులను కలిశాడు. అనంతరం సోమవారం తిరిగి హాస్టల్కు వచ్చాడు. అతను సోమవారం మధ్యాహ్నం లంచ్ కోసం, రాత్రి భోజనం కోసం బయటకు రాలేదు.
విద్యార్థులు గదికి వెళ్లి చూడగా ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. కిటికీ బద్దలు కొట్టిన తోటి విద్యార్థులు, గదిలోకి ప్రవేశించారు. పోలీసులకు సమాచారం అందించారు. అయితే, నాగేంద్ర కుమార్ రెడ్డి ఆత్మహత్యకు కారణం తెలియవలసి ఉంది. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ సంతాపం తెలిపారు.
భానుప్రీతి ఆత్మహత్యపై విచారణ జరిపిస్తాం: దేవినేని
విజయవాడ నగరంలో ఆత్మహత్యకు పాల్పడిన భానుప్రీతి సంఘటన పైన విచారణ జరిపిస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మంగళవారం చెప్పారు. భానుప్రీతి ఘటన గురించి ఆమె స్నేహితులను మంత్రి దేవినేని అడిగి తెలుసుకున్నారు. కొత్త ప్రభుత్వాసుపత్రిలో భానుప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మంత్రులు దేవినేని, పీతల సుజాతలు భానుప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వివాహేతర సంబంధానికి సహకరించడం లేదని మహిళ హత్య
వివాహేతర సంబంధానికి మహిళ సహకరించడం లేదని ఏలూరులో ఓ వ్యక్తి మహిళను హత్య చేశాడు. మృతి చెందిన మహిళకు భర్త, ఇద్దరు కుమారులు, ఓ కుమారుడు ఉన్నారు. ఆమెకు మద్యం సేవించే అలవాటు ఉంది.
మంగళవారం నాడు ఉదయం సమీపంలోని ఓ బ్రాండీ దుకాణంకు వెళ్లి మద్యం సేవించింది. అదే సమయంలో ఆమెతో గతంలో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తి కనిపించాడు.
ఆమెతో పాటు ఇంటికి వచ్చాడు. వివాహేతర సంబంధానికి ఆమె సహకరించడం లేదని తువ్వాలుతో మెడకు బిగించాడు. ఆమె ఊపిరాడక మృతి చెందింది. అనంతరం అతను పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
భార్యను చంపి పరారీ
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం తిమ్మాయిపాలెంలో ఓ భర్త భార్యను చంపి పరారయ్యాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.