భర్త స్నేహితుడే!: ఆమెతో అక్రమ సంబంధం.. వద్దన్నందుకు దారుణ హత్య!
ఆమెతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన రవీందర్ అనే వ్యక్తే ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్దారించారు.
చండూరు: చండూరులో హత్యకు గురైన వెంకటమ్మ(26) హత్యోదంతం మిస్టరీ వీడింది. ఆమెతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన రవీందర్ అనే వ్యక్తే ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్దారించారు. నిందితుడుగా కూడా నేరం అంగీకరించడంతో మిస్టరీకి తెరపడింది.
పోలీసుల కథనం ప్రకారం.. నర్సింహ, రవీందర్ ఇద్దరూ బోర్ వెల్ మెషీన్ వర్క్ చేస్తున్నారు. ఇద్దరూ ఒకే బోరు బండిపై పనిచేస్తుండటంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అలా నర్సింహ ఇంటికి రవీందర్ తరుచూ వస్తూ పోతుండేవాడు. ఈ క్రమంలో నర్సింహ భార్య వెంకటమ్మతో పరిచయం పెంచుకున్నాడు.
ఆపై అది వివాహేతర సంబంధానికి దారి తీయగా.. ఇటీవల వెంకటమ్మ అతన్ని దూరం పెడుతూ వస్తోంది. ఇక్కడితో ఇక తమ సంబంధానికి ఫుల్ స్టాప్ పెడుదామని అతన్ని బతిమాలింది. రవీందర్ మాత్రం వెంకటమ్మ మీద కక్షతో రగిలిపోయాడు. తనను దూరం పెడుతున్నందుకు పగ తీర్చుకోవాలనుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఒకరోజు వెంకటమ్మ వ్యవసాయ భూమి వద్ద పనిచేస్తున్న తన సోదరుడు శేఖర్ కు భోజనం తీసుకెళ్లడాన్ని రవీందర్ గమనించాడు. దారి మధ్యలో ఆమెను అటకాయించి వాగ్వాదానికి దిగాడు. తీవ్ర ఆగ్రహావేశంలో పక్కనే ఉన్న ఓ గుడిసెలో నుంచి గొడ్డలి తీసుకొచ్చి ఆమెను దారుణంగా నరికాడు. ఆమె చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత మృతదేహాన్ని పక్కనే ఉన్న గుంటలో పడవేసి తాటికమ్మలు కప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.
వెంకటమ్మ సోదరుడు వెలిబుచ్చిన అనుమానం మేరకు రవీందర్ కోసం పోలీసులు గాలించారు. అతను పరారీలో ఉండటం కూడా వారి అనుమానాలకు బలం చేకూర్చింది. శుక్రవారం బంగారిగడ్డలో నిందితుడు తిరుగుతున్నాడన్న సమాచారంతో పోలీసులు అక్కడికెళ్లారు. చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నిజం అంగీకరించాడు. రవీందర్ పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.