వైదేహి మెడికల్ కాలేజ్ పై ఐటీ దాడులు: రూ. 43 కోట్లు సీజ్ !
బెంగళూరు: బెంగళూరు నగరంలో ప్రసిద్ధి చెందిన వైదేహి ఆసుపత్రి గ్రూప్స్ మీద ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. వైదేహి మెడికల్ కాలేజ్ ట్రస్టీకి చెందిన ఓ వ్యక్తి ఇంటిలో సోదాలు చేసి రూ. 43 కోట్లు స్వాధీనం చేసుకున్నారని వెలుగు చూసింది.
స్వాధీనం చేసుకున్న రూ. 43 కోట్లలో అన్ని రూ. 1,000, రూ. 500 నోట్లు ఉన్నాయని ఐటీ అధికారులు అంటున్నారు. బెంగళూరు నగరంలోని వైట్ ఫీల్డ్ లోని శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో వైదేహి ఆసుప్రతి ఉంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ, వ్యాపారవేత్త, దివంగత డీ.కే. ఆదికేశవులు నాయుడు స్థాపించిన వైదేహి గ్రూప్స్ లో మెడికల్ కాలేజ్ లు, ప్యారా మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, వైదేహి చారిటబుల్ ఆసుపత్రి ఉన్నాయి.
వైదేహి ఆసుపత్రి ట్రస్టీగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు శాసన సభ నియోజక వర్గం శాసన సభ్యురాలు డీ.ఏ. సత్యప్రభ (డీ.కే.ఆదికేశవులు సతీమణి) ఉన్నారని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు. దేశంలో జరిగిన అతి పెద్ద రెండో ఐటీ దాడి అని వెలుగు చూసింది.
పుదుచ్చేరి మెడికల్ కాలేజ్ మీద దాడి చేసిన ఐటీ అధికారులు రూ. 82 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. గత సంవత్సరం డిసెంబర్ లో కర్ణాటకలోని రాయచూరులో సర్వోదయ ట్రస్టు నిర్వహిస్తున్న మెడికల్ కాలేజ్ మీద దాడి చేసి రూ. 19.5 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
వైదేహి గ్రూప్స్ కు ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడులో బ్రాంచ్ లు ఉన్నాయని తెలిసింది. అక్కడా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని సమాచారం. బెంగళూరులో ఐటీ అధికారులు ఇంకా దాడులు, సోదాలు చేస్తూనే ఉన్నారు. మెడికల్ కాలేజ్ సీట్లు ఇవ్వడానికి ఇంత పెద్ద మొత్తంలో డోనేషన్స్ తీసుకున్నారని అధికారులు అంటున్నారు.