ఉత్కంఠ: గెలుపెవరిది? ఒక్క రాష్ట్రంలో విభిన్న తీర్పు!
హైదరాబాద్: యావద్భారత దేశం శుక్రవారం వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. మన రాష్ట్రంలోను ఢిల్లీ పీఠంపై ఉత్కంఠ ఉన్నప్పటికీ... రాష్ట్ర ఫలితాల పైనే ఎక్కువ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన ఎన్నికలు కావడంతో మన రాష్ట్రంలో.... ఏ ప్రాంతంలో ఏ పార్టీకి మెజార్టీ వస్తుందనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.
శుక్రవారం నాడు ఫలితాలు వెలువడుతున్నప్పటికీ... రాష్ట్రంలో జూన్ 2 తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) ప్రభుత్వాలు ఏర్పాటు కానున్నాయి. విభజన పైన కేంద్రం జూన్ 2వ తేదీన అపాయింటెడ్ డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఒక్క రాష్ట్రంలో రెండు భిన్న తీర్పులు!
సాధారణంగా ఒక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండే అవకాశం ఎక్కువ. కానీ మన రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో రెండు భిన్న తీర్పులు వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెసు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసే రేసులో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట కోసం పాకులాడుతోంది. ఇక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒకటి రెండు జిల్లాల్లో ఒకటి రెండు స్థానాలు మాత్రమే కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీమాంధ్రలో అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చే అవకాశముంది. తెరాసను పక్కన పెడితే.. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే రేసులో ఉన్న కాంగ్రెసు పార్టీ సీమాంధ్రలో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఇటీవల పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు, టిడిపిలు అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటే కాంగ్రెసు పార్టీ మాత్రం ఓ చిన్న పార్టీ స్థాయిలో సీట్లు గెలుచుకుంది. ఇదే కాంగ్రెసు తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు రేసులో ఉండటం గమనార్హం.
సీమాంధ్రలో టిడిపి వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్
ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం చూసినా, ఇటీవల వచ్చిన ప్రాదేశిక, మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకారం చూసినా సీమాంధ్రలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య పోటా పోటీ ఉంటుంది. ఏ పార్టీ గెలిచినా పదిపదిహేను సీట్ల తేడాతో మాత్రమే గెలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిల మధ్య పోటా పోటీ నెలకొంది.
సీమాంధ్రలో టిడిపికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 90 నుండి 115 అసెంబ్లీ స్థానాలు, 11 నుండి 15 లోకసభ స్థానాలు, తెలంగాణలో తెరాసకు 50 నుండి 60, కాంగ్రెసు పార్టీకి 40కి పైగా స్థానాలు వస్తాయని చెబుతున్నారు. సీమాంధ్రలో... పది పదిహేను సీట్ల తేడాతో టిడిపి లేదా జగన్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం తెరాస లేదా కాంగ్రెస్ రావొచ్చునని లేదా హంగ్ ఏర్పడవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
మోడీ జోరు
కేంద్రం విషయానికి వస్తే ఢిల్లీ పీఠం బిజెపి వశమవుతుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే 2004, 2009లలోను ఇవే చెప్పాయి. ఇప్పుడు అదే పునరావృతం అవుతుందని పలువురు కాంగ్రెసు నేతలు చెబుతున్నప్పటికీ... పదేళ్ల యూపిఏ వైఫల్యం, కుంభకోణాల నేపథ్యంలో నాటిలా రివర్స్ అయ్యే అవకాశాలు లేవని, మోడీ ప్రధాని కావడం ఖాయమని అంటున్నారు. థర్ఢ్ ఫ్రంట్ పైన కూడా ఆశలు పెట్టుకునే వారు లేకపోలేదు.
వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలు చావో రేవో తేల్చేవని అనే వాదన ఉంది. కాంగ్రెసు పార్టీని వ్యతిరేకించి పార్టీ స్థాపించిన జగన్ ఉప ఎన్నికల్లో తన సత్తా చాటారు. అయితే అదంతా సెంటిమెంట్ వల్లే అనే అభిప్రాయం ఉంది. ఇటీవల ప్రాదేశిక, మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టిడిపి కంటే వెనుక బడింది.
చిరంజీవి
సీమాంధ్ర పార్టీలో కాంగ్రెసు పార్టీ దాదాపు జీరో అయిందనే చెప్పవచ్చు. 2004, 2009లలో అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు మిగిలిన పార్టీలకు కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ వచ్చిన దూకుడు మీద ఉన్నారు. 2004లో పార్టీ సత్తా చాటిన కెసిఆర్కు చీలిక సెగ తగిలింది. 2009లో ఆశించిన స్థానాలు గెల్చుకోలేదు. ఆయితే ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో తెరాసలోకి భారీగా టిడిపి, కాంగ్రెసు పార్టీల నుండి చేరారు. ఇప్పుడు ఆ పార్టీ గెలుపు ఊపులో ఉంది.
చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ పరిస్థితి సీమాంధ్రలో, తెలంగాణలో భిన్నంగా ఉంది. తెలంగాణలో ఆ పార్టీ పరువు కోసం పాకులాడుతుండగా, సీమాంధ్రలో గెలుపు ఆశల పల్లకిలో ఉంది. సీమాంధ్రలో ఆ పార్టీ గెలవకుంటే జగన్ లాగే చావోరేవో అని అంటున్నారు.
జయసుధ
2009లో వైయస్ రాజశేఖర రెడ్డి కారణంగా రాజకీయాల్లోకి వచ్చి సికింద్రాబాదు నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున గెలిచిన జయసుధ... ఆ తర్వాత పలుమార్లు రాజకీయాల పైన తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇప్పుడు ఆమె మరోసారి బరిలో ఉన్నారు.
రోజా
గతంలో తెలుగుదేశం పార్టీ నుండి చిత్తూరు జిల్లా నుండి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన నటి రోజా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున నగరి నుండి బరిలో నిలిచారు.
బాలకృష్ణ - పురంధేశ్వరి
నిన్నటి వరకు యూపిఏలో కేంద్రమంత్రిగా ఉన్న పురంధేశ్వరి ఇప్పుడు బిజెపి నుండి రాజంపేట లోకసభకు పోటీ చేశారు. హీరో నందమూరి బాలకృష్ణ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి హిందూపురం నుండి పోటీ చేస్తున్నారు.
విజయమ్మ
వైయస్ ఉండగా ఇంటి నుండి కాలు బయట పెట్టని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ.. రెండుసార్లు పులివెందుల నుండి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు పులివెందులను తన తనయుడు జగన్ కోసం విడిచి పెట్టి విశాఖ లోకసభకు పోటీ చేస్తున్నారు.
పొన్నాల లక్ష్మయ్య
రాష్ట్ర విభజన తర్వాత టిపిసిసి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్యయ్య అయ్యారు. తెలంగాణ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో తమదే గెలుపు అని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాతో ఉంది.
బొత్స సత్యనారాయణ
ఇటీవలి వరకు పిసిసి అధ్యక్షులుగా ఉన్న బొత్స సత్యనారాయణ... సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ ఓటమిని తేల్చేశారు. ఇక ఆయనతో పాటు ఎందరు సీనియర్లు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
డికె అరుణ
తెలంగాణలో కాంగ్రెసు పార్టీ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మహిళా ముఖ్యమంత్రిని చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. అదే నిజమైతే రేసులో మొదటగా డికె అరుణ ఉంటారు.