టీ తాగుతారా? నోటీసులిచ్చిన సిఐడీ అధికారులతో లోకేష్ ఆసక్తికర ప్రవర్తన!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు రాకముందే రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే టీడీపీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తర్వాత నారా లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారని వార్తలు వచ్చిన నేపథ్యంలో లోకేష్ కు తాజాగా సిఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఇప్పటికే వాట్సప్ లో సిఐడీ అధికారులు నోటీసులను జారీ చేయగా, తాజాగా ఢిల్లీ వెళ్లి మరీ ఏపీ సిఐడీ అధికారులు లోకేష్ కు నోటీసులు జారీ చేశారు. ఈ సమయంలో లోకేష్ వారితో ప్రవర్తించిన తీరు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చిన సిఐడి అధికారులు అక్టోబర్ 4వ తేదీన విచారణకు హాజరుకావాలని కోరారు.

ఢిల్లీలోని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ ఇంటికి వెళ్లిన సిఐడి అధికారులు లోకేష్ కు నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. చంద్రబాబు కేసుల నిమిత్తం సంప్రదింపులు జరిపేందుకు ఢిల్లీలో ఉన్న లోకేష్ ను కలుసుకున్న సిఐడీ అధికారులు అక్కడికి వెళ్లి ఆయనకు నోటీసులు ఇవ్వగా ఢిల్లీ ఎప్పుడు వచ్చారు అంటూ సిఐడి అధికారులను ప్రశ్నించారు.

ఉదయమే వచ్చామని వారు లోకేష్ కు బదులిచ్చారు. whatsapp లో నోటీసు అందుకుని రిసీవ్డ్ అని రిప్లై కూడా ఇచ్చానని లోకేష్ పేర్కొన్నారు. రాకరాక వచ్చినందుకు కాఫీ తాగుతారా.. టీ తాగుతారా.. తమ ఆతిథ్యం తీసుకోవాలని సిఐడి అధికారులను లోకేష్ కోరారు. నోటీస్ అందుకున్నట్టు సంతకం పెట్టాలని వారు కోరగా నోటీసులో కొన్ని పదాల పట్ల లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
తనను విచారణ దశలోనే నేరస్తుడిగా ఎలా నిర్ధారిస్తారు అని లోకేష్ ప్రశ్నించారు. అంతేకాదు అందులోని కొన్ని వ్యాఖ్యలను తప్పుపట్టిన లోకేష్ అధికారులను వివరణ అడిగారు. అవి పొరబాటున తప్పుగా వచ్చాయని సిఐడి అధికారులు వివరించారు. కట్, కాపీ, పేస్ట్ విధానం అమలు చేసినట్టు ఉన్నారంటూ లోకేష్ సిఐడి అధికారులతో వ్యాఖ్యలు చేశారు. మరి నోటీసులు తీసుకున్న నారా లోకేష్ అక్టోబరు 4వ తేదీన విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications