బాబు, మోడీపై ఎలా: తెలంగాణతో పవన్ మొదలెట్టారు!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం ప్రారంభించారా? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీనిపై చాలా రోజులుగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం జర్నలిస్టు సంఘాలు తెలంగాణ రాజధాని హైదరాబాదులో భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీకీ పవన్ కళ్యాణ్ కూడా తన మద్దతు ప్రకటించారు. తద్వారా పవన్ కళ్యాణ్.. తెలంగాణ రాష్ట్రం నుండి ప్రశ్నించడం ప్రారంభించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించి.. ఆ తర్వాత టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. బీజేపీ, టీడీపీల తరఫున ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో విస్తతంగా పర్యటించారు. టీడీపీ, బీజేపీలకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్ అప్పుడే.. టీడీపీ, బీజేపీలు అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలు తప్పులు చేసినా తాను ప్రశ్నిస్తానని చెప్పారు.

ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా గడిపారు. ఆ తర్వాత సినిమాల పైన దృష్టి సారించారు. తన చేతిలో ఉన్న సినిమాల తర్వాత రాజకీయాల పైన ఆయన దృష్టి సారించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసే అవకాశాలున్నాయి.
ఎన్నికలకు ముందు ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్.. తెలంగాణ నుండి దానిని ప్రారంభించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదల, రైల్వే ఛార్జీల పెంపు విషయమై కేంద్రం పైన స్పందిస్తారా? అనే చర్చ సాగుతోంది. అయితే, వాటి పెరుగుదలల విషయంలో ఎన్డీయే ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
యూపిఏ హయాంలో ఆర్థికవ్యవస్థ దారుణంగా తయారయిందని, దానిని గాడిలో పెట్టేందుకేనని చెప్పారు. ప్రధాని మోడీ కూడా కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ.. దేశం కోసం కఠిన నిర్ణయాలు తప్పవని చెప్పారు. ఒకటి రెండేళ్లు తనను తిట్టుకున్నప్పటీకీ ఆ తర్వాత మెచ్చుకుంటారని చెప్పారు. చంద్రబాబుకు కూడా ఇది వర్తిస్తుంది. కేంద్రం, ఏపీ ప్రభుత్వంల పైన ముందుముందు పవన్ ఎలా స్పందిస్తారనే విషయమై చర్చ సాగుతోంది. ఇప్పటికే మోడీ ప్రభుత్వం ధరలు పెంచుతోందని, బాబు ప్రభుత్వం హామీలను నెరవేర్చడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications