టీడీపీలో చేరిన జమ్మలమడుగు నేతలు; టీడీపీలో వారికి చోటు లేదన్న చంద్రబాబు సంచలనం
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి జమ్మలమడుగు నేతలు చేరారు. కడప జిల్లా జమ్మలమడుగు నేతలు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఆయన కుమారుడు భూపేష్ రెడ్డిలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రస్తుత బీజేపీ నేత మాజీ మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డికి, నారాయణ రెడ్డి సోదరుడు. కాగా మంచి రాజకీయ నేపథ్యమున్న జమ్మలమడుగు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్టీ కోసం పని చెయ్యాలని, ప్రజల సమస్యల కోసం పోరాటం చెయ్యాలని వారిని కోరారు.
టీడీపీలో చేరిన జమ్మలమడుగు నేతలు నారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జమ్మలమడుగు నేతలైన నారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డిలకు పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతించారు. వారు కూడా చంద్రబాబు నేతృత్వంలో పని చెయ్యటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీకి కంచుకోటని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన భూపేష్ రెడ్డి యువకుడని, అతనికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు టిడిపి ఇన్చార్జిగా నియమిస్తున్నట్లు కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఎన్నికల ముందు వాసన పసిగట్టి పార్టీలో చేరే వారికి అవకాశం ఇవ్వను
జమ్మలమడుగులో పార్టీ కోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే సమయంలో గతంలో పార్టీని వీడి వెళ్లిన వారిని ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పార్టీని వదిలి వెళ్లారని, ఎన్నికల ముందు వాసన పసిగట్టి పార్టీలో చేరే వారికి అవకాశం ఇవ్వనని, అలాంటి వారిని దగ్గరకు కూడా రానివ్వనని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టే ఆరోజు అంబేద్కర్ రాజ్యాంగం రాశారని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ రెడ్డి అన్నీ గాలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం గాల్లో వచ్చారు, గాల్లోనే వెళుతున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు.
పార్టీ కోసం ఎవరు పని చేస్తున్నారు .. చెయ్యటం లేదన్నది రాసి పెడుతున్నా అన్న చంద్రబాబు
సీఎం జగన్మోహన్ రెడ్డికి అహంకారం తప్ప అనుభవం లేదని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారు లేకపోతే తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టికెట్లు కూడా ఆన్లైన్ లో పెట్టి కూడా అప్పు తెచ్చుకుంటారు అంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీలో ఎవరు పార్టీ కోసం పని చేస్తున్నారు? ఎవరు పార్టీ కోసం పని చేయడం లేదు అనేది రాసి పెడుతున్నాను అని చెప్పిన చంద్రబాబు ఈసారి పనిచేసే వారికి మాత్రమే పార్టీలో పదవులు అని స్పష్టం చేశారు. పార్టీ మారి వచ్చే వాళ్లకు అవకాశం ఉండబోదని చంద్రబాబు తేల్చి చెప్పారు. తాను గతంలో ఈ సిద్ధాంతం విషయంలో కఠినంగా ఉండలేకపోయాను అని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు, ముందు ముందు పార్టీ నిర్ణయాల విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తామని, ఎలాంటి సంశయాలకు తావు లేకుండా కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.