ఆ కులాల్లోని వారే టార్గెట్?: మాయావతి ఎదుట పవన్ కీలక ప్రతిపాదన, అందుకే దీదీతో భేటీ జరగలేదు
అమరావతి/లక్నో: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు హఠాత్తుగా ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకు వెళ్లారు. బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం ముఖ్యమంత్రి మాయావతిని కలిసేందుకు ఆయన వెళ్లారు. జనసేనాని మాయావతిని బుధవారమే కలవాల్సిందని తెలుస్తోంది. కానీ ఆమె నగరంలో (లక్నో) అందుబాటులో లేకపోవడంతో కలవలేదని సమాచారం.
జనసేనాని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు తదితరులతో కలిసి లక్నోకు వెళ్లారు. మాయావతి అందుబాటులో లేకపోవడంతో పవన్ బుధవారం లక్నోలో విస్తృతంగా పర్యటించారు. బీఎస్పీ సీనియర్ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలకడంతో పాటు దగ్గర ఉండి లక్నోలోని పలు ప్రదేశాలను చూపించారు.

మాయావతి ఎదుట పవన్ కీలక ప్రతిపాదన
2019లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, తెలుగు రాష్ట్రాలలో లోకసభ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీతో సంబంధాల కోసం పవన్ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కలిసి పోటీ చేద్దామని బీఎస్పీ అధినేత్రి ఎదుట పవన్ కళ్యాణ్ కీలక ప్రతిపాదన పెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

రెండు రాష్ట్రాల్లో బీఎస్పీకి చేయూత
రెండు తెలుగు రాష్ట్రాల్లోని అణగారిన వర్గాలకు బీఎస్పీ ద్వారా ఎదిగేందుకు తాను అవకాశం ఇస్తానని పవన్.. మాయావతికి ఆఫర్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అణగారిన వర్గాల కోసమే జనసేన పని చేస్తుందని, బీఎస్పీ దాని కోసమే పని చేస్తోందని, ఇద్దరిదీ ఒకే లైన్ అని ఆమెకు వివరించనున్నారు.

వారి ఆధిపత్యానికి చెక్ చెబుతారా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్మ, రెడ్లలతో పాటు ఇతరుల ఆధిపత్యం ఉందనే వాదనలు ఉన్నాయి. మిగతా వారిని వీరు రాజకీయంగా తమ చేతుల్లో పెట్టుకున్నారని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ కులాలను లేదా ఈ కులాల్లోని వారిని అందర్నీ ఆయన వ్యతిరేకించడం లేదు. కేవలం రాజకీయాల్లో ఉన్న కొన్ని కుటుంబాలు కులాల పేరుతో రాజకీయం చేస్తూ.. పబ్బం గడుపుకుంటున్నాయనేది జనసేనాని వాదన. కులాలను గౌరవిస్తానని ఆయన పదేపదే చెబుతున్నారు. అదే సమయంలో కులం పేరుతో చాలామంది రాజకీయాలు చేస్తున్నారని, కానీ ఏ కులమూ బాగుపడటం లేదని, కానీ కుటుంబాలు బాగుపడుతున్నాయని చెబుతూ వస్తున్నారు. వారే ఆయన టార్గెట్గా చెబుతున్నారు. బీఎస్పీ వంటి పార్టీలతో కలిసి కొన్ని కులాల చేతిలో రాజకీయ ఆధిపత్యానికి చెక్ చెప్పడమే పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యమని అంటున్నారు.

ఉడుతా సాయం
అదే జరిగితే అటు పవన్ కళ్యాణ్, ఇటు బీఎస్పీకి తెలుగు రాష్ట్రాల్లో లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అయితే అది ఓటు బ్యాంకుగా ఎంత వరకు మారుతుందనేది ప్రశ్న. తన బలానికి తోడు మాయావతి ఓటు బ్యాంకు తోడైతే ఉడుతా సాయం అన్నట్లుగా ఉంటుందనేది పవన్ అభిప్రాయం కావొచ్చని అంటున్నారు.

ఇద్దరికీ లాభం
పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ ఏ మేరకు ఓటు బ్యాంకుగా మారుతుందో తెలియదు. అదే సమయంలో బీఎస్పీకి తెలుగు రాష్ట్రాల్లో పట్టు లేదు. ఆమె వచ్చి పార్టీని బలోపేతం చేసిందీ లేదు. కానీ దళిత నాయకురాలిగా ఆమె పట్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానం.. ఓటు బ్యాంకుగా మారదని చెప్పలేమని అంటున్నారు. అప్పుడు పవన్కు ప్లస్ అవుతుందని చెబుతున్నారు. అదే సమయంలో ఏమాత్రం పట్టులేని బీఎస్పీతో కలిసి పోటీ చేయడం ద్వారా పవన్కు ఉన్న క్రేజ్.. మాయావతి పార్టీకి లబ్ధి చేకూరుస్తుంది. పవన్ కారణంగా ముందుముందు ఆ పార్టీ ఎంతోకొంత బలపడే అవకాశాలూ కొట్టి పారేయలేమని చెబుతున్నారు.

ఎక్కువ లబ్ధి బీఎస్పీకే
జనసేన, బీఎస్పీలు కలిస్తే పరస్పరం లబ్ధి చేకూరవచ్చునని, కానీ ఎక్కువ లబ్ధి మాత్రం మాయావతి పార్టీకేనని చెబుతున్నారు. ఏమాత్రం ప్రభావం లేని పార్టీని తీసుకు వచ్చి ఇక్కడ తన ద్వారా పరిచయం చేయడం ద్వారా ఆ పార్టీకి ఇక్కడా జీవం పోస్తున్నట్లేనని, దాంతో ముందు ముందు ఆ పార్టీకి ప్లస్ అవుతుందని అంటున్నారు. అదే సమయంలో పవన్కు చేకూరే లబ్ధి మాత్రం కొంతేనని అంటున్నారు. లెఫ్ట్ పార్టీలు ఎలా అయితే పవన్ను ఉపయోగించుకొని ఎదగాలని భావిస్తున్నాయో ఇదీ అంతే అంటున్నారు. ఆ పార్టీల వల్ల పవన్కు పెద్దగా వచ్చేది ఏమీ లేదని, కానీ ఆయన వల్ల వారికి ప్లస్ అవుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications