జనసేన పోలిట్ బ్యూరో సభ్యుల నియామకం: జేడీ లక్ష్మీనారాయణకు దక్కని చోటు: పార్టీ వీడినట్లేనా.
ఎన్నికల్లో ఊహించని ఫలితాలు ఎదుర్కొన్న జనసేన కీలకమైన పోలిట్ బ్యూరో ను ఖరారు చేసింది, మొత్తం నలుగురి సభ్యులతో పోలిట్ బ్యూరో.. 11 మంది సభ్యులతో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్గా నాదెండ్ల మనోహర్ను నియమించగా.. క్రమశిక్షణా సంఘం చైర్మన్గా మాదాసు గంగాధరం నియమితు లయ్యారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సైతం పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడుగా నియమితులయ్యారు. ఇక, ఎన్నికల ముందు జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ఏ కమిటీలోనూ లేరు. దీని ద్వారా ఆయన పార్టీ వీడినట్లే అనే ప్రచారం జరుగుతోంది. ఆయన కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
జనసేనలో కమిటీలు ఏర్పాటు..
పార్టీ ఏర్పాటు చేసినా..ఇప్పటి వరకు కీలక కమిటీల ఏర్పాటులో ఆలస్యం చేసిన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ ఇక ఇ ప్పుడు పార్టీలో ముఖ్యులతో కమిటీలను ఏర్పాటు చేసారు. పార్టీకి ముఖ్యమైన జనసేన పొలిట్ బ్యూరోను ప్రకటించారు. ఇందులో సభ్యులుగా నాదెండ్ల మనోహర్, పి రామ్మోహన్ రావు, రాజు రవితేజ్, అర్హం ఖాన్లు నియమితులయ్యారు. ఈ నియమకాల్లో పార్టీ అధినేత పవన్ కళ్యాన్ తొలి నుండి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగానే నాదెండ్ల మనోహర్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోది. తోట చంద్రశేఖర్కు సైతం పోలిట్ బ్యూరోలో కాకుండ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో అవకాశం ఇచ్చారు. పార్టీలో ఈ పోలిట్ బ్యూరో ద్వారానే కీలక నిర్ణయాలను..విధాన పరమైన అంశాల్లో పార్టీ వైఖరిని ఖరారు చేస్తారు. దీంతో..ఇప్పుడు ఈ కమిటీలో నియమితులైన సభ్యులు జనసేనలో కీలకంగా మారనున్నారు.
పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ప్రకటన..
ఇక, పార్టీ రాజకీయ వ్యవహారాలు చూసేందుకు జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి ఛైర్మన్ గా నాదెండ్ల మనోహర్ నియమితులయ్యారు. అదే విధంగా మరో 11 మందిని సభ్యులుగా నియమించారు. అందులో తోట చంద్రశేఖర్, ప్రస్తుత ఎమ్మెల్యే రాకాప వరప్రసాద్, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, కందుల దుర్గేష్, కోన తాతా రావు, ముత్తా శశిధర్, పాలవలస యశస్విని, డాక్టర్ పసుపులేని హరిప్రసాద్, మనుక్రాంత్ రెడ్డి, భరత్ భూషణ్, బి. నాయకర్ లను సభ్యులుగా నియమించారు. ఇక, జనసేన పార్టీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్గా మాదాసు గంగాధరంను నియమిస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో పార్టీ కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఈ కమిటీలను ఏర్పాటు చేసారు.
జెడి లక్ష్మీనారాయణ ఎక్కడ..
సీబీఐ జేడీగా అందరికీ సుపరిచితుడైన లక్ష్మీనారాయణ పేరు జనసేన ప్రకటించిన కమిటీల్లో ఎక్కడా కనిపించలేదు. రాజకీయంగా అనేక తర్జన భర్జనల తరువాత లక్ష్మీ నారాయణ ఎన్నికల ముందు జనసేనలో చేరారు. లక్ష్మీ నారాయణ కు పవన్ కళ్యాణ్ విశాఖ ఎంపీగా బరిలోకి దించారు. ఆయనకు మద్దుతగా అదే లోక్సభ నియోజకవర్గంలోని గాజువాక నుండి పవన ఎమ్మెల్యేగా పోటీ చేసారు. అయితే, ఇద్దరూ ఓడిపోయారు. ఫలితాల తరువాత కొద్ది రోజులు కనిపించిన లక్ష్మీ నారాయణ కొంత కాలంగా జనసేనకు..రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన జనసేన వీడుతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ధృవీకరణ కాలేదు. ఇక, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన పార్టీ కీలక కమిటీల్లో లక్ష్మీ నారాయణకు ఎక్కడా స్థానం దక్కలేదు. దీంతో..ఇక లక్ష్మీనారాయణ జనసేన కు దూరమైనట్లుగానే కనిపిస్తోంది. అయితే, ఆయన తన రాజకీయ భవిష్యత్ పైనా ఇప్పటి వరరకు ఎక్కడా స్పందించలేదు.