Janasena: పవన్ కల్యాణ్ పోటీచేసే నియోజకవర్గం ఖరారు??
జనసేనాని పవన్కల్యాణ్ 2024 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయబోతున్నారనే ఉత్కంఠ కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీచేసి ఓటమి పాలైన పవన్ ఈసారి నియోజకవర్గ వేటలో ఉన్నారు. అది ఇప్పటికే ఖరారైందని, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. అది ఏదో కాదు.. 2009 ఎన్నికల్లో తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీచేసి తిరుపతి నియోజకవర్గం.

ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలి
ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే పట్టుదలతో ఉన్న పవన్ అందుకు అనుగుణంగా అనువైన నియోజకవర్గం కోసం అన్వేషణలో ఉన్నారు. మరోసారి భీమవరం, గాజువాక నుంచి పోటీచేయడం శ్రేయస్కరం కాదన్న వాదన జనసేన వర్గాల్లో గట్టిగా ఉండటంతో నియోజకవర్గం మారాలని పవన్ నిశ్చయించుకున్నారు. తిరుపతిలో చిరంజీవి, పవన్ను అభిమానించే వారి సామాజికవర్గం ఓట్లు కూడా దండిగా ఉండటంతో ఇక్కడి నుంచి పోటీచేస్తే విజయం ఖాయమనే అంచనా ఉంది.

తిరుపతి ఖాయమేగా..?
పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి పోటీచేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఆ పార్టీ నాయకత్వం సామాజిక మాధ్యమాలద్వారా ప్రచారం ప్రారంభించింది. పవన్ తిరుపతి నుంచి పోటీచేయాలనే డిమాండ్తో కూడి ట్వీట్లను రీట్వీట్ చేస్తున్నారు. తిరుపతికి ఇటీవలికాలంలో జనసేన తరఫున ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ నాయకులు ప్రమాణస్వీకారం అయిన తర్వాత పవన్ తిరుపతి నుంచి పోటీచేయాలంటూ పిలుపునిచ్చారు.

కమ్యూనిస్టులవల్ల, బీజేపీవల్ల పవన్కు ప్రయోజనం సున్నా!!
గత ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని పోటీచేసిన పవన్ కల్యాణ్కు వారివల్ల ఓనగూడిన ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంవల్ల మైనార్టీ ఓట్లు దూరమవుతాయి. ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తుంటే తిరుపతి నుంచి గెలుపొందడం అనేది నల్లేరు బండిపై నడకే అవుతుందని భావిస్తున్నారు. కానీ పొత్తు ఇంకా ఖరారు కాలేదు. పవన్ కల్యాణ్ ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేసి అసెంబ్లీలో అడుగుపెట్టడం అనేది క్లిష్టంగా మారింది. టీడీపీతో పొత్తువల్ల ఈ క్లిష్టతను అధిగమించవచ్చని రాజకీయ విశ్లేషకులు సూచనలిస్తున్నారు. అది ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాలి మరి.!!












Click it and Unblock the Notifications