జనసేన మాతోనే ఉంది-నమ్మండి ప్లీజ్-సోము వీర్రాజు వీడియో క్లారిటీ..
ఏపీలో బీజేపీ-జనసేన మధ్య పొత్తుకు కాలం చెల్లిందంటూ ఈ మధ్య తెగ ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం మిత్రపక్షం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, చర్యలే. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ బీజేపీపై చేసిన వ్యాఖ్యలు, అనంతరం చంద్రబాబుతో విజయవాడ నోవోటెల్ హోటల్లో భేటీ తర్వాత మొదలైన ఈ ఊహాగానాలు నిజమనేలా ఇరుపార్టీల చర్యలు కూడా ఉంటున్నాయి. అదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ తో మరింత ఇరుకునపడిన బీజేపీ ఇప్పుడు రోజూ వివరణలు ఇస్తోంది.

బీజేపీ-జనసేన పొత్తుపై డైలమా ?
ఏపీలో 2019 ఎన్నికల తర్వాత కుదిరిన బీజేపీ-జనసేన పొత్తు పేరుకు కొనసాగుతోంది. అయితే ఇరు పార్టీలు ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టడం కానీ, కలిసి పాల్గొనడం కానీ చేయడం లేదు. అలాగే పలు అంశాల్లో ఇరుపార్టీలు విభేదిస్తున్నాయి కూడా. అమిత్ షా చెప్పేవరకూ బీజేపీ అమరావతి రాజధాని పోరుకు దూరంగానే ఉంది. అలాగే బీజేపీ మతపరమైన అజెండా ప్రకారం చేపడుతున్న కార్యక్రమాలకు జనసేన కూడా దూరంగానే ఉంటూ వస్తోంది. అదే సమయంలో విశాఖ ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఇరు పార్టీల మధ్య గ్యాప్ మరింత పెంచాయి. విశాఖ నుంచి తిరిగి వచ్చాక మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఈ డైలమా పూర్తిగా బయటపడింది.

పవన్ వ్యాఖ్యల చిచ్చు
జనసేన, బీజేపీ పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఊహాగానాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా వైసీపీకి వ్యతిరేకంగా పోరాడే విషయంలో బీజేపీని రోడ్ మ్యాప్ అడిగానని, కానీ ఇవ్వట్లేదని పవన్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో తన దారిలో తాను వెళ్తున్నట్లు పవన్ చెప్పేశారు. అదే రోజు చంద్రబాబు నోవోటెల్ హోటల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ను వచ్చి కలిశారు. దీంతో వీరిద్దరూ వైసీపీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోందని, దీనికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే బీజేపీతో కలిసి ఈ పోరాటం చేస్తారా లేదా అన్నది మాత్రం చెప్పలేదు.

జనసేన మాతోనే ఉందంటున్న బీజేపీ
ఇక అప్పటి నుంచి బీజేపీ నేతలు వరుసగా జనసేనతోనే మా పొత్తు కొనసాగుతుందని, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదని తరచూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా టీడీపీతో పొత్తు ఉండబోదంటూ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ పదే పదే చెప్పడం మొదలుపెట్టారు. తద్వారా తాము కేవలం జనసేనతోనే కలిసి ఉంటామని చెప్పుకొచ్చారు. పవన్ బీజేపీ కలిసి రావడం లేదని,తన దారి తాను వెతుక్కుంటున్నట్లు బహిరంగంగానే చెప్పేసినా కాషాయ నేతలు మాత్రం ఆయనతమతోనే ఉన్నారని చెప్పుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.
సోమువీర్రాజు వీడియో క్లారిటీ
బీజేపీ, జనసేన కటీఫ్ అంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోకూడా విడుదల చేశారు. ఇందులో సోము వీర్రాజు బీజేపీ, జనసేన పొత్తుపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అనంతపురంలో జరిగిన మీడియా సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారన్నారు. బిజెపి, జనసేన పార్టీకి సంబంధించి అంశంలో అవాస్తవాలను ప్రచారం చేశారన్నారు. జనసేన పార్టీతో బిజెపి పొత్తు కొనసాగుతుందని, జనసేనతో దూరం పాటించాలని బిజెపి నిర్ణయించినట్లుగా జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. బిజెపి ఎప్పుడు జనసేనతో పొత్తు, జనంతో పొత్తు, అన్నట్లుగా పనిచేస్తుందన్నారు. ఇరు పార్టీలు కలిసే ప్రయాణం చేస్తాయని సోము క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications