జగన్కు ఒక్క ఓటురాదు: జెసి, అపరిచితుడు: మారెప్ప
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ బరిలో నిలిచిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి హామీ ఇచ్చి తప్పుకొందని అనంతపురం జిల్లా సీనియర్ శాసన సభ్యులు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి గురువారం ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేసిన ఆదాల గురువారం తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జెసి మాట్లాడారు. సమైక్యాంధ్రప్రదేశ్గా ఉంటే జగన్కు ఒక్క ఓటు కూడా పడదని అందుకే రాష్ట్రం విడిపోవాలని జగన్ కోరుకుంటున్నారని ఆరోపించారు. జగన్ సమైక్యవాది కాదని, సమైక్యం ముసుగులో ఉన్న విభజనవాది అని ధ్వజమెత్తారు. సమైక్యవాదాన్ని వ్యతిరేకించే వారిని ఓడించాలనే తాము బరిలో నిలిచామని చెప్పారు.
జగన్పై మారెప్ప మళ్లీ
వైయస్ జగన్ పైన మాజీ మంత్రి మారెప్ప మరోసారి నిప్పులు చెరిగారు. జగన్ ఓ అపరిచితుడని, సమైక్య ముసుగు వేసుకున్న విభజనవాది మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలన్న ఆయన కల ఎప్పటికీ నెరవేదని విమర్శించారు. జగన్ సిఎం అయితే ఆయన పాలన హిట్లర్, ముసోలినీల కంటే భయంకరంగా ఉంటుందన్నారు.
బాబు, వెంకయ్యలపై గండ్ర
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడితో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్న రహస్య ఒప్పందాన్ని బిజెపి అమలు చేస్తున్నట్లుగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి వేరుగా అన్నారు. బాబు నైజాన్ని ఇప్పటికైనా టిటిడిపి నేతలు గుర్తించి పార్టీ నుంచి బయటకు రావాలన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మిగులు ఓట్లను ఎవరికి వేయాలనే విషయంపై, రేపు ఉదయం నిర్ణయిస్తామని చెప్పారు.
పార్టీతో పాటు తెలంగాణ అంశం కూడా ప్రధానమైందే కాబట్టి తెలంగాణ అభ్యర్థికే ఓటు వేసే పరిస్థితులు కూడా ఉన్నాయని తెలిపారు. రేపు ఉదయం తెలంగాణ ప్రజాప్రతినిధులు సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పిసిసి అధ్యక్షులు బొత్స వ్యవహారశైలి ఇరు ప్రాంతాలకు సమానంగా లేదన్నారు. ఎపి భవన్లో ముఖ్యమంత్రి బస్సుకు అడ్డుపడిన మంత్రులు ఎమ్మెల్యేలతో మాట్లాడక పోవడం బాధాకరమన్నారు.