కాకినాడ పోర్టులో భారీ ట్విస్ట్-కేవీ రావుకు వాటాల రిటర్న్-అరబిందోకు సెజ్ ?
కాకినాడ పోర్టు యాజమాన్య హక్కుల విషయంలో కొంతకాలంగా జరుగుతున్న వివాదం కీలక మలుపు తిరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు యజమానిగా ఉన్న కేవీ రావును బెదిరించి అధికార పార్టీ నేతలు తమకు అనుకూలమైన అరబిందో సంస్థకు దీన్ని రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇప్పటికే కేవీ రావు ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ దర్యాప్తు జరుపుతోంది. అలాగే ఈడీ విచారణ కూడా జరుగుతోంది. ఇలాంటి సమయంలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది.
గతంలో కేవీ రావు ఆధ్వర్యంలోని కాకినాడ సీపోర్టు ప్రమోటర్ గా ఉన్న కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థ నుంచి యాజమాన్య వాటాల్ని వైసీపీ ప్రభుత్వ పెద్దలు బెదిరించి తమకు సన్నిహిత సంస్ద అయిన అరబిందో రియాల్టీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పోర్టులోని 41.12 శాతం వాటాల్ని కేవలం రూ.494 కోట్లకు బెదిరించి రాయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఐడీ, ఈడీ విచారణ జరుపుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం అరబిందో సంస్థ గతంలో తాము కేవీ రావు నుంచి తీసుకున్న వాటాల్ని తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిఫలంగా అప్పట్లో తనకు చెల్లించిన సొమ్మును సైతం కేవీ రావు తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. అలాగే గతంలో తన ఆధ్వర్యంలో ఉన్న 8 ఎకరాల కాకినాడ సెజ్ విషయంలో మాత్రం జోక్యం చేసుకోకుండా కేవీ రావు అంగీకరించారు. దీంతో కాకినాడ సెజ్ అరబిందోకే దక్కింది. మూడు రోజుల క్రితం ఈ వాటాల బదిలీ పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే కాకినాడ పోర్టుకు స్టాక్ ఎక్చేంజ్ తో సంబంధం లేకపోవడంతో గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం పూర్తి చేసినట్లు సమాచారం.
అయితే దీనిపై ఇరు వర్గాల నుంచి కానీ, ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.












Click it and Unblock the Notifications