4జిల్లాల సేవలో 'రత్నాచల్': 'కాపు'పై బాబు డైలమా, సాయంత్రం పవన్ కళ్యాణ్ ప్రెస్మీట్
విజయవాడ: విశాఖపట్నం - విజయవాడల మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్ప్రెస్ (12727/12728)కు ఏపీలోని నాలుగు జిల్లాలతో ఎనలేని అనుబంధం ఉంది. సుమారు ఇరవై రెండేళ్లుగా ఈ రైలు కోస్తాంధ్ర ప్రజలకు ఎనలేని సేవల్ని అందిస్తోంది.
351 కి.మీ.ల దూరం ప్రయాణించే ఈ రైలు 6 గంటల్లోనే గమ్యానికి చేరవేస్తుంది. విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పన్నెండు రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
విశాఖలో రోజూ మధ్యాహ్నం 12.40 గంటలకు బయల్దేరి రాత్రి 6.35 గంటలకు విజయవాడ చేరుతుంది. విజయవాడ నుంచి రోజూ ఉదయం 6.05 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12.15 గంటలకు విశాఖ చేరుతుంది. పండుగలొస్తే ఈ రైలుకు మరీ డిమాండ్ ఉంటుంది.
తుని ఘటన నేపథ్యంలో పలు రైళ్లు నేడు, రేపు రద్దయ్యాయి. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఇవాళ రేపు రద్దయింది. హైదరాబాద్, విశాఖ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. కొన్నింటిని దారి మళ్లించారు. విజయవాడ, రాజమండ్రి, విశాఖ సెక్షన్లో రైళ్లను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం చేశారు. సికింద్రాబాద్ హౌరా ఫలక్ నుమా ఎక్స్ప్రెస్ రైలును దారి మళ్లించారు.

మంత్రులు, పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపు
కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి అత్యవసర సమావేశానికి పిలుపు వచ్చింది. ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో పాటు మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావులతో పాటు కాపు వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా వెంటనే రావాలని బాబు ఆదేశించినట్టు తెలుస్తోంది.
వీరందరితో మధ్యాహ్నం తరవాత సమావేశమై పరిస్థితిని సమీక్షించనున్న చంద్రబాబు, ఒకవేళ ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షకు దిగితే తలెత్తే పరిస్థితులు, ఆపై తీసుకోవాల్సిన చర్యలపై వారిని అడిగి తెలుసుకోనున్నట్టు సమాచారం.
ఉద్యమం తీవ్రరూపమైతే, నియంత్రణ సాధ్యం కాదని భావిస్తున్న ఏపీ మంత్రులు, త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే చంద్రబాబుకు సూచించారు. ఇక కాపులకు రిజర్వేషన్లు ప్రకటించే దిశగా ముందడుగు పడితే వెనుకబడిన తరగతుల నుంచి ఉద్యమం మొదలవుతుందని భావిస్తుండటంతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై సందేహాలున్నాయి.
ఇదిలా ఉండగా, మధ్యాహ్నం మూడు గంటలకు ముద్రగడ పద్మనాభం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు. జూబ్లిహిల్స్లోని తన నివాసంలో సాయంత్రం నాలుగు గంటలకు పవన్ మీడియాతో మాట్లాడుతారు.












Click it and Unblock the Notifications