ప్రపంచానికి చెప్పారని కేసీఆర్: విస్తరణ, సురేఖకి ఛాన్స్!
హైదరాబాద్: నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం చెప్పారు. ఎంసీహెచ్ఆర్డీలో 'నవ తెలంగాణ సమాలోచన' పేరిట విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు.
నెలాఖరులో మంత్రివర్గాన్ని విస్తరిస్తామని చెప్పారు. కాగా, మంత్రివర్గ విస్తరణలో వరంగల్ జిల్లా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖకు చోటు దక్కే అవకాశముంది. కాగా, ఎంసీహెచ్ఆర్డీలో కేసిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2.25 లక్షల ఎకరాల భూమి పరిశ్రమలకు సిద్ధంగా ఉందని చెప్పారు.

రుణమాఫీ పైన రానున్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలో రాష్ట్ర సలహా కమిటీని నియమిస్తామని చెప్పారు. రీసెర్చ్ అండ్ అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్ను అభివృద్ధి చేస్తామన్నారు. తొలుత పంచాయతీరాజ్ కమ్యూనిటీని డెవలప్ చేస్తామన్నారు.
పంచాయతీరాజ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం బాధాకరమన్నారు. చట్టాలు, మార్గదర్శకాలు నూతనంగా చేస్తామన్నారు. తెలంగాణ విత్తన పరిశ్రమకు చాలా అనువైనదని చెప్పారు. గ్రామ, మండల, జిల్లాల వారీగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. వాటర్ షెడ్ గురించి ప్రపంచానికి తెలిపింది తెలంగాణకు చెందిన కాకతీయ రాజులే అన్నారు.
కాకతీయుల కాలంలో చెరువులు తవ్వి అభివృద్ధి చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెరువులను నిర్లక్ష్యం చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కవులు, గాయకులు చెరువుల వల్ల ఉపయోగాలను ప్రజలకు పాటల రూపంలో చెప్పాలన్నారు. తెలంగాణలో ప్రతి ఎకరా భూసారాన్ని పరిరక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications