జగన్ అలా సీఎం కోరిక తీర్చుకోవచ్చు: కేఈ సలహా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం నిప్పులు చెరిగారు. ముప్పై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పిన జగన్ వ్యాఖ్యల పైన కేఈ స్పందించారు.
మూడు రోజులైనా ముఖ్యమంత్రి సీటులో కూర్చోవాలని జగన్ ఆశపడుతున్నట్లుగా ఉందన్నారు. మాక్ అసెంబ్లీ పెట్టుకొని, అందులో ముఖ్యమంత్రి పాత్ర పోషించి ఆ కోరిక తీర్చుకోవచ్చునని ఎద్దేవా చేశారు. రెండు రోజుల క్రితం జగన్ మాట్లాడుతూ.. తాను ఓసారి సీఎం అయితే ముప్పై ఏళ్లు పాలిస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
పాస్ పుస్తకం లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తే సస్పెండ్ చేస్తాం
రెవెన్యూ అధికారులు, సిబ్బందికి కేఈ కృష్ణమూర్తి హెచ్చరికలు జారీ చేశారు. పాస్ పుస్తకాలు లేకుండా ఎవరైనా రిజిస్ట్రేషన్లు చేస్తే సస్పెండ్ చేస్తామన్నారు.
రెవెన్యూ భూముల విషయంలో వీఆర్వోల అక్రమాల పైన విచారణ చేపడతామన్నారు. నిర్ణీత సమయంలో రైతుల దరఖాస్తులకు స్పందించని అధికారులకు జరిమానా విధిస్తామన్నారు. జీవో 571 పైన ఈ నెల 19 మంత్రివర్గ ఉపసంఘం భేటీ అవుతుందని చెప్పారు.