చెప్పుతో కొట్టొద్దు.. ఓటుతో వేటేయండి: బాబుపై కిరణ్
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కారకులైన వారికి చెప్పుతో కొట్టవద్దని.. వారికి ఓటుతోనే సమాధానం చెప్పాలని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం తూర్పు గోదావరి జిల్లా కడియంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వరంగల్, నల్గొండ జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తాను లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ ఏర్పడిందని చెప్పారని, జై తెలంగాణ నినాదాలు కూడా చేశారని అన్నారు. ఆ మాట తూర్పు గోదావరి జిల్లాలో చెప్పగలరా అని చంద్రబాబును ప్రశ్నించారు.
అలా చెబితే ఏం చేస్తారని కిరణ్ ప్రశ్నించగా.. కొందరు చెప్పుతో కొడతామని అన్నారు. చెప్పుతో కొట్టొద్దు.. వారికి ఓటుతోనే సమాధానం చెప్పాలని కిరణ్ సూచించారు. తనకు మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్న ఆశలేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తనకు ముఖ్యమని అన్నారు. రాష్ట్ర విభజన బాధాకరమని కిరణ్ అన్నారు.
విభజనతో విద్యా, ఉద్యోగాలతోపాటు అన్ని రంగాల్లో ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు. పోలవరం నీళ్లు కావాలంటే ఢిల్లీకి వెళ్లాలా అని కిరణ్ ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్తోపాటు చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలే కారణమని ఆరోపించారు. విభజనవాదులకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.