పవన్ పార్టీ: ఎమ్మెల్యేలకు కిరణ్ ఎర, చేజారకుండా...?
హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇక పార్టీలోకి వచ్చే వారిపై దృష్టి పెడుతున్నారు. కేవలం ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే పార్టీ ప్రారంభ సభకు వచ్చిన నేపథ్యంలో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆయన ఈ అంశంపైనే దృష్టి పెడుతున్నట్లు సమాచారం.
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పార్టీ పెడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తన వర్గం నుంచి ఎవరూ చేజారిపోకుండా, ఇతర పార్టీల నుంచి సమైక్య నినాదం వినిపించిన వారిని ఆకట్టుకునేలా చూడాలని కిరణ్ భావిస్తున్నారు. ఈ బాధ్యతను తనకు అత్యంత సన్నిహితులైన వారికి ఆయన అప్పగించినట్లు సమాచారం.

సమైక్య ఉద్యమంలో తనతోపాటు కలిసి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఇప్పుడు దూరంగా ఉండడంతో వారిని కొత్త పార్టీలోకి ఆహ్వానించే పనిలో ఆయన ఉన్నట్లు కనిపిస్తోంది. కొంతమందితో స్వయంగా మాట్లాడుతున్న కిరణ్కుమార్రెడ్డి ఇతరులతో చర్చించే బాధ్యతను తన సన్నిహితులకు అప్పగించినట్లు తెలుస్తోంది.
రాజమండ్రిలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో తన ఆకర్ష్ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయన్న విశ్వాసాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. 40 వేల మంది వస్తే చాలు అనుకున్న సభకు ఏభై వేల మందికి పైగా హాజరుకావడంతో కిరణ్లో ఆత్మ విశ్వాసం పెరుగుతోందని, నామినేషన్ల సమయానికి కొత్త వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో విద్యార్ధులు, ఉద్యోగులను కూడా పార్టీలోకి ఆహ్వానించే పనిలో కిరణ్ నిమగ్నమయ్యారు. ఇప్పటికే కొంతమంది విద్యార్థి సంఘ నాయకులతో చర్చించిన కిరణ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారట. 90 రోజులపాటు జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంఘాల వారిపై కూడా కిరణ్ దృష్టి పెడుతున్నారు. దీనికోసం వారితో సంప్రదింపులు చేసేలా కొంతమందికి బాధ్యతలు అప్పగించినట్లు కూడా సమాచారం.












Click it and Unblock the Notifications