బిజెపి, అసెంబ్లీ: రాజీనామాపై కిరణ్ రెడ్డి పునరాలోచన
హైదరాబాద్/న్యూఢిల్లీ: అసెంబ్లీకి విభజన బిల్లు వచ్చాక దానిని ఓడించి రాజీనామా చేయాలనుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు పునరాలోచనలో పడ్డారా? అంటే అవుననే అంటున్నారు. 2014 ఎన్నికల వరకు విభజన జరిగే ఆస్కారం లేదని బలంగా నమ్ముతున్న కిరణ్ రాజీనామా ఆలోచనను పక్కన పెట్టారట.
తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యూసి ప్రకటన వెలువడగానే పలువురు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు రాజీనామా చేశారు. సొంత పార్టీపై నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. విభజనను వ్యతిరేకిస్తున్న కిరణ్ కూడా రాజీనామా చేయనున్నారని పలుమార్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే అసెంబ్లీలో విభజన బిల్లును ఓడించాక రాజీనామా చేసే ఆలోచనలో కిరణ్ ఉన్నట్లుగా ఆ తర్వాత వార్తలు వచ్చాయి.

ఇప్పుడు కిరణ్ రాజీనామా ఆలోచన చేయడం లేదంటున్నారు. అందుకు విభజన జరగదనే గట్టి నమ్మకం ఉండటమే అంటున్నారు. పార్లమెంటుకు తెలంగాణ బిల్లు వస్తే బిజెపి తప్పకుండా దానిని వ్యతిరేకిస్తుందని, తెలంగాణకు అనుకూలమేనని చెప్పినప్పటికీ సీమాంధ్రకు న్యాయం పేరుతో బిజెపి తప్పుకునే అవకాశం లేకపోలేదని కిరణ్ భావిస్తున్నారట.
అంతేకాకుండా ఢిల్లీ పెద్దల తీరు చూస్తుంటే తెలంగాణ బిల్లు శీతాకాల సమావేశాల్లో వచ్చే అవకాశం లేదని, రాయల తెలంగాణ పేరుతో కొత్త వాదనకు తెరలేపినందున ఆలస్యం అయ్యే అవకాశముందని, దీంతో వచ్చే ఎన్నికల వరకు విభజన జరగదనే నమ్ముతున్నారట. అసెంబ్లీలో బిల్లు నెగ్గకుంటే పార్లమెంటులో ఇబ్బంది తప్పదని కిరణ్ భావిస్తున్నారంటున్నారు.












Click it and Unblock the Notifications