జోన్ పేరిట ప్రజల మధ్య చిచ్చు: చంద్రబాబు చీకటి ఒప్పందమని కేవీపీ నిప్పులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు హోదా సాధించే విషయంలో కాంగ్రెస్ పార్టీకి సరైన విధానం లేకపోవడం వల్లనే సక్సెస్ కాలేకపోయామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనతో ఏపీని కేంద్రం మోసం చేసిందని అన్నారు. పోలవం ప్రాజెక్టు కోసం రాష్ట్రాన్ని కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టుపెట్టారని ఆరోపించారు. ప్రత్యేక రైల్వే జోన్ కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఐదు కోట్ల ఏపీ ప్రజలకు గంతలు కట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీ తెచ్చుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.వాళ్లకు రాష్ట్ర భవిష్యత్తుతో సంబంధం లేదని, అందుకే కేంద్రం ఏం చెప్పినా దానికి హర్షామోదాలు చెబుతున్నారని అన్నారు.
చంద్రబాబు తరఫున కేంద్రంతో బేరసారాలు సాగించిన నాయకులు కూడా అదే చెప్పారని అన్నారు. ఇప్పుడు కొత్త విధానం ప్రకారం చంద్రబాబు చేతికి కేంద్రం డబ్బు ఇస్తుందని, అందులోంచి ఆయనకు కావల్సిన లబ్ధి చేకూర్చుకుంటారని.. ఇందులో ప్రజలకు మిగిలేది సున్నా మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి హోదా సాధనలో విషయంలో అందరం కలిస్తే ఈసారి విజయవంతం అవుతామని చెప్పారు.
తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రధాని మోడీ హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. విభజన చట్టంలో ఉన్న వాటిని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న వారు మాట తప్పారని అన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి హోదా ఇవ్వని పక్షంలో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఏపీకి హోదా తప్పక ఇస్తుందని ఆయన అన్నారు.
విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. ఆంధ్రప్రదేశ్కు హోదా సాధించేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను చేపట్టామని, హోదా సాధించే వరకు ఆందోళనలు చేస్తూనే ఉంటామని చెప్పారు. కేంద్రం వైఖరికి నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్ను చేపడుతున్నామని, జాతీయ రహదారులను దిగ్భందనం చేస్తామని చెప్పారు. ఏపీకి హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.