బెజవాడపై పగ బట్టిన వరుణుడు - మరో హెచ్చరిక..!!
బెజవాడ పై వరుణుడు పగబట్టాడు. వరదలు పెను విషాదానికి కారణమయ్యాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. అయినా, అనేక మంది బాధితులకు ఇంకా ఆహారం అందటం లేదు. వరద తగ్గుముఖం పడుతున్న వేళ వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో మరోసారి వర్షాల పై అంచనా వేసింది. దీంతో, యంత్రాంగం అప్రమత్తమైంది. విజయవాడలో ప్రస్తుతం వర్షం కురుస్తోంది.
మరో సారి వర్షం
విజయవాడ ప్రజలు వర్షం అంటే ఆందోళనకు గురవుతున్నారు. బుడమేరు ముంపుతో విజయవాడ నగరం మునిగిపోయింది. ప్రాణనష్టం జరిగింది. దీని నుంచి కోలుకోక ముందే మరోసారి విజయవాడ, గుంటూరు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. 2.30 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడటంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. నిన్న సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో వరద పీడిత ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న సాయంత్రానికి వరద నీరు కొంతమేర తగ్గింది.

తాజా హెచ్చరికలు
ప్రస్తుతం మళ్ళీ వర్షం పడటంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విజయవాడలో వదర తీవ్రత తగ్గినా ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. ఎటు చూసినా వరద, బురదే కనిపిస్తోంది. ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. మొత్తంగా వరద బాధితుల ఆవేదన వర్ణనాతీతంగా మారాయి. ఈ సమయంలోనే ఈనెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందంటోంది. దీంతో రెండు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాల కురుస్తాయనే అంచనాలు వెల్లడయ్యాయి.
వరద తగ్గినా
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పూర్తిగా తగ్గింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బ్యారేజి వద్ద ఈ రోజు ఉదయం 5 లక్షల 25 వేలకు వరద ప్రవాహం చేరుకుంది. 30 గంటలలో ఆరున్నర లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం తగ్గింది. బ్యారేజ్ దిగువ భాగంలో నదీతీర ప్రాంతాల్లో జల దిగ్బంధనం నుంచి గ్రామాలు క్రమంగా బయట పడుతున్నాయి.












Click it and Unblock the Notifications