దిశ వాహనాలకు జెండాఊపి మహిళల భద్రతకు భరోసా ఇచ్చిన జగన్.. ఇదేనా భద్రత? లోకేష్ సూటిప్రశ్న
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా మరణాలపై అసెంబ్లీ సమావేశాల సమయంలో జగన్ సర్కార్ ను దారుణంగా టార్గెట్ చేసిన నారా లోకేష్ రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలకు బలైపోతున్న వారిపై కూడా జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. వైసీపీ నాయకుడు చేతిలో మహిళ దారుణ హత్యకు గురైందని, మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్న భద్రత ఇదేనా అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు.
మహిళ హత్య: రాష్ట్రంలో వైసిపి దండుపాళ్యం గ్యాంగ్ అరాచకాలకు పరాకాష్ట
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కొంగావారి పల్లి కి చెందిన గాజుల వ్యాపారి రమణమ్మని ఆర్థిక వ్యవహారాలలో చోటు చేసుకున్న వివాదంతో వైసిపి నేత ఎన్ వెంకట్ రమణారెడ్డి అతి దారుణంగా కొట్టి చంపడం రాష్ట్రంలో వైసిపి దండుపాళ్యం గ్యాంగ్ అరాచకాలకు పరాకాష్ట అని మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారు అంటూ లోకేష్ మండిపడ్డారు.

మహిళల భద్రతకు నాది భరోసా అన్న జగన్.. ఇదేనా భద్రత
ప్రజలు అధికారం ఇచ్చింది కబ్జాలు, దోపిడీలు అడ్డు పడిన వారిని చంపడానికి లైసెన్స్ అన్నట్టు దారుణాలకు తెగబడుతున్నారు అని నారా లోకేష్ మండిపడ్డారు.అంతేకాదు ఇటీవల జగన్రెడ్డి దిశ వాహనాలకి జెండా ఊపి ప్రారంభించి మహిళల భద్రతకి నాది భరోసా అని చెప్పారని గుర్తు చేసిన లోకేష్, జగన్ మహిళల భద్రతపై మాయమాటలు చెప్పి మూడురోజులు కాలేదు. వైసీపీకి చెందిన వెంకట్రమణారెడ్డి మహిళని అత్యంత పాశవికంగా కొట్టి చంపేశాడు అంటూ ద్వజమెత్తారు.

రాష్ట్ర ప్రజల ప్రాణాలకి దేవుడే దిక్కు: లోకేష్
ఇదేనా ముఖ్యమంత్రి మహిళలకు మీరిచ్చే భద్రత? అని ప్రశ్నించిన లోకేష్ అండగా నిలవాల్సిన ప్రభుత్వమే అంతమొందిస్తుంటే, న్యాయం చేయాల్సిన పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తుంటే..రాష్ట్ర ప్రజల ప్రాణాలకి దేవుడే దిక్కు అంటూ రాష్ట్రంలో పరిస్థితులపై తీవ్ర అసహనం వెళ్లగక్కారు. వైసిపి అరాచక పాలనలో ప్రజల, మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.

చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకుడి చేతిలో మహిళ దారుణ హత్య..
ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ముదివేడు సమీపంలో రమణమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురికావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గాజుల వ్యాపారం చేసుకునే 37ఏళ్ల రమణమ్మను ఇంటి స్థల వివాదం, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో వైసిపికి చెందిన వెంకటరమణారెడ్డి దారుణంగా హతమార్చారు. రమణమ్మను ఇద్దరు ముగ్గురు కలిసి హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ దారుణ ఘటనపైనే లోకేష్ జగన్ ను టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications