ఇదీ జరిగింది: చీరాల ప్రేమజంట విషాదం వెనుక.. ఆ విషయం ఎవరికీ తెలియదు!
పెళ్లి చేసుకున్నారు కానీ పెద్దల భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చీరాల: వాళ్లిద్దరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్.. కాలేజీలో ఎప్పుడూ కలిసి తిరిగినట్లుగా కూడా కనిపించరు. ఎలా దగ్గరయ్యారో తెలియదు కానీ ఒకరికొకరు అన్న రీతిలో వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇంట్లో చెబితే ఒప్పుకోరేమోనన్న భయంతో ఎవరికీ చెప్పకుండానే పెళ్లి కూడా చేసేసుకున్నారు.
పెళ్లి చేసుకున్నారు.. కానీ! ఆ ధైర్యం లేక రైలు కింద పడి ఆత్మహత్య..
కానీ ఆ విషయాన్ని వాళ్లకు నచ్చజెప్పడం తమవల్ల కాదని భావించారు. అంతే.. ఆత్మహత్యే శరణ్యమనుకుని రైలు కింద పడ్డారు. వేటపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట కరణం సందీప్ (22), గోగిరెడ్డి మౌనిక(21)లకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఒకే కాలేజ్:
నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రంకు చెందిన కరణం శ్రీనివాసరావు కుమారుడు సందీప్ (22), గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరుకు చెందిన గోగిరెడ్డి పెద్దిరెడ్డి కుమార్తె మౌనిక (21) చీరాలలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. సందీప్ సీఎస్ఈ మూడో సంవత్సరం కాగా, మౌనిక రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె కాలేజీ హాస్టల్లోనే ఉంటోంది.
శనివారం ఇంటికి:
గత శనివారం హాస్టల్లో అనుమతి తీసుకుని ఇంటికి వెళ్లింది. తిరిగి మంగళవారం ఉదయం రైలులో చీరాల బయలుదేరింది. బాపట్ల వరకు తల్లిదండ్రులతో ఫోన్ ద్వారా అందుబాటులోనే ఉంది. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ అయిపోయపింది. సందీప్ కూడా మంగళవారం యధావిధిగా కాలేజీకి బయలుదేరాడు. కానీ కాలేజీకి వెళ్లకుండా చీరాల రైల్వే స్టేషన్ వెళ్లి మౌనికను కలుసుకున్నాడు.
వాళ్లు ప్రేమికులని ఎవరికీ తెలియదు:
చీరాల రైల్వే స్టేషన్ నుంచి ఇద్దరు కలిసి విజయవాడ బయలుదేరారు. అక్కడే పెళ్లి కూడా చేసుకని తిరుగు పయనమయ్యారు. విషయాన్ని పెద్దలకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా.. వారి నుంచి సానుకూల స్పందన రాలేదు. చీరాల చేరుకున్న తర్వాత స్నేహితులు కొంతమంది వారిని చూశారు కానీ పెళ్లి చేసుకున్నారన్న విషయం కూడా వారికి తెలియదు. ఒకే కాలేజీ వాళ్లు కదా.. మాట్లాడుకుంటున్నారేమో అనుకున్నారు. వాళ్లిద్దరూ కాలేజీలో ఎప్పుడూ కలిసి కనిపించకపోవడంతో ఎవరికీ అనుమానం కూడా రాలేదు. అయితే ఫోన్స్, చాటింగ్ ద్వారానే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు.
ఆత్మహత్యకు ముందు మెసేజ్:
ఆత్మహత్యకు ముందు సందీప్ తన స్నేహితుడికి మెసేజ్ చేశాడు. తాము ఆత్మహత్య చేసుకోబోతున్నామని చెబుతూ మెసేజ్ చేసి.. ఫోన్ స్విచాఫ్ చేశాడు. అనంతరం చీరాల నుంచి వేటపాలెం వైపుగా వెళ్లారు. అక్కడే రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సందీప్ మెసేజ్ చూసిన స్నేహితుడు.. వేటపాలెం వెళ్లి రైల్వే స్టేషన్ సమీపంలో వెతికారు. పట్టాల వెంబడి వారి మృతదేహాలు కనిపించడంతో.. పోలీసులకు, వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.