భార్యను చంపేసి, మిస్సింగ్ కేసు పెట్టాడు: దొరికిపోయాడు
చిత్తూరు: కళాశాల నుంచి ఇంటికి తీసుకుని వెళ్తానని చెప్పి భార్యను బైక్ మీద ఎక్కించుకుని, ఆమెను నిర్మానుష్యమైన ప్రదేశంలోకి తీసుకుని వెళ్లి భర్త చంపేశాడు. ఆమె చేత పురుగుల మందు తాగించి హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు మిస్సింగ్ కేసు పెట్టాడు.
తన భార్య కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. భర్త చెబుతున్న విషయాల్లో పొంతన లేకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో అసలు విషయం వెలుగు చూసింది.
తాను భార్యను చంపేసి, కంప చెట్లలో పడేశానని అతను చెప్పాడు. దాంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలం కమ్మరాయనిమిట్ట సమీపంలో ఆదివారంనాడు వెలుగు చూసింది.
చిత్తూరు జిల్లా కట్టమంచికి చెందిన కుసుమ కుమారి (21)కి బెంగుళూరులో నివాసం ఉంటున్న జి. కేశవులు అనే యువకుడితో రెండు నెలల క్రితం వివాహమైంది. కుసు కుమారి బిఈడి చదువుతోంది. మూడు రోజుల క్రితం కళాశాలకు వెళ్లిన ఆమెను తిరిగి తీసుకురావడానికి వెళ్లి కేశవులు ఆమెను బైక్పై ఎక్కించుకుని కమ్మరాయనిమిట్ట సమీపంలోని గుట్టపైకి తీసుకుని వెళ్లి పురుగుల మందు తాగించి హత్య చేశాడు.
ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో అతను తన నేరాన్ని అంగీకరించాడు. అదనపు కట్నం కోసం తన కూతురిని వేధించి, ఆ తర్వాత చంపేశాడని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.