మీ అమ్మను చంపేశా, వెళ్లి చూడు: కూతురికి ఫోన్ చేసి తండ్రి
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి అత్యంత దారుణమైన సంఘటనకు ఒడిగట్టాడు. భార్యను చంపడమే కాకుండా, ఆ విషయం కూతురికి ఫోన్ చేసి చెప్పాడు. మీ అమ్మను చంపేశా, వెళ్లి చూసుకో అని కూతురికి చెప్పాడు. ఈ సంఘటన అనంతపురం శివారులోని హమాలీ కాలనీలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది.
గంగాధర్, ఆత్మకూరు రాజమ్మ దంపతులు హమాలీ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. కూతుళ్లకు వివాహం చేశారు. వీరు ఉంటున్న కాలనీలోనే కూతుళ్లు కూడా నివాసం ఉంటున్నారు.
గంగాధర్ గుత్తి ప్రభుత్వ ఆస్పత్రిలో అటెండర్గా పనిచేస్తున్నాడు. అయితే, తాగుడికి బానిసై విధులను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. దీంతో అతనికి బదులు కుమారుడు విధులకు వెళ్తున్నాడు. రాజమ్మ ఇళ్లలో పాచి పని చేస్తుండేది.
రోజూ మద్యం సేవించేందుకు గంగాధర్ రాజమ్మను వేధిస్తూ ఉండేవాడు. డబ్బులివ్వకపోతే కొట్టేవాడు. గురువారం రాత్రి మద్యం కోసం డబ్బులడిగాడు. ఆమె ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో ఇరువురి మధ్య చాలా సేపు గొడవ జరిగింది. దీన్ని మనసులో పెట్టుకుని గంగాధర్ శుక్రవారం తెల్లవారు జామున రోకలి బండతో రాజమ్మ నుదుటిపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
ఆ తర్వాత గంగాధర్ పెద్ద కూతురు అరుణజ్యోతికి ఫోన్ చేసి మీ అమ్మను చంపేశాను, వెళ్లి చూసుకో అని చెప్పాడు. దాంతో ఆమె అక్కడికి వెళ్లి చూసేసరికి తల్లి మరణించి ఉంది. పోలీసులకు సమాచారం ఇచ్చింది. నిందితుడు పరారీలో ఉన్నాడు.