అనురాధ హత్యానంతరం దుండగులు థ్యాంక్స్: కాళ్లకు మగాళ్ల చెప్పులు, బూట్లు
చిత్తూరు: మేయర్ అనురాధ,త ఆమె భర్త కటారి మోహన్ హత్యోదంతంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేయడానికి, ఆ తర్వాత దుండగులు పారిపోవడానికి మేయర్ పక్కన ఉన్నవారే దారులు చూపించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు మోహన్ అనుచరవర్గంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Photos: అనురాధ అంతిమయాత్ర
మేయర్ దంపతులపై కాల్పులు జరిపిన తర్వాత దుండగులు కార్పోరేషన్ కార్యాలయం నుంచి బయటకు వెళ్తూ అక్కడ ఉన్న ఓ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో మేయర్ వర్గానికి చెందినవారిపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం.
Photos: మేయర్ అనూరాధ దంపతుల హత్య
ముసుగులు ధరించి మేయర్ ఛాంబర్లోకి ముగ్గురు దుండగులు వెళ్తున్న సమయంలో వాళ్ల కాళ్లకు మగవాళ్ల చెప్పులు, బూట్లు కనిపించడంతో మేయర్ అనుచరులు అప్రమత్తమయ్యారని, వారిని ఆపడానికి ప్రయత్నించారని అంటున్నారు.
మేయర్కు బాగా తెలిసిన వ్యక్తులే ఛేంబర్లోకి దారి చూపినట్లు అనుమానిస్తున్నారు. హత్య చేసిన తర్వాత కార్పోరేషన్ కార్యాలయం ప్రధాన ద్వారం తలుపులు మూసేశారు. ఆ సమయంలో హంతకులు కార్యాలయం నుంచి తప్పించుకునే అవకాశం లేదు.
అయితే, కార్పోరేషన్ కార్యాలయంపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు ప్రజారోగ్య శాఖ విభాగం పక్కన ఉన్న ప్రహరీగోడ దూకవచ్చుననే సలహా ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ, మేయర్ దంపతుల హత్యకు ముందు దుండగలు రెక్కీ నిర్వహించారని, దాంతో ప్రధాన ద్వారం నుంచి కాకుండా వేరే ఎలా పారిపోవచ్చునో ముందే తెలుసుకుని ఉంటారని కూడా అంటున్నారు.