జగన్పై బాలయ్య మార్క్ పంచ్ డైలాగ్స్
Godavari floods 2024: ఇటీవలే కురిసిన భారీ వర్షాలు, దానివల్ల సంభవించిన వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురయ్యాయి. దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు, చెరువులు ఏకం అయ్యాయి. జనావాసాలన్నీ జలమయం అయ్యాయి.
ఏలేరు దెబ్బ..
అదే తరహా పరిస్థితులు అటు కాకినాడ జిల్లాలోనూ ఏర్పడ్డాయి. జిల్లాలోని ఏలేరు ఉప్పొంగింది. వరద తాకిడికి గురైంది. దీని ప్రభావంతో పిఠాపురం నియోజకవర్గంలోని అనేక గ్రామాలు నీట మునిగాయి. వేలాది హెక్టార్లల్లో చేతికి అందిన పంట నీటిపాలయింది. ఏలేరు రిజర్వాయర్ ఇన్ఫ్లో కూడా ఏ మాత్రం తగ్గట్లేదు.

వేల ఎకరాల్లో..
ఏలేరు ఉధృతి వల్ల జిల్లా వ్యాప్తంగా 75,000 ఎకరాల మేర వరి, ఇతర పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనివల్ల 41,000 మంది రైతులకు నష్టపోయినట్లు గుర్తించారు. పంట నష్టం భారీగా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
జగన్ పరామర్శ..
ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో పర్యటించారు. ఏలేరు వరద ఉద్ధృతికి గురైన గ్రామాలకు వెళ్లారు. అక్కడి రైతులతో మాట్లాడారు. వరద బాధితులను పరామర్శించారు. తామున్నామనే భరోసా ఇచ్చారు జగన్.
తామే ఉంటే..
తమ ప్రభుత్వం ఉండి ఉంటే, రైతుకు పెట్టుబడి కింద 13,500 రూపాయలు, ఎకరాకు 7,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ వచ్చేదని జగన్ వ్యాఖ్యానించారు. ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్నీ తమ ప్రభుత్వమే పూర్తిగా కట్టి ఉండేదని, దీనివల్ల 24,000 నుంచి 29,000 వేల రూపాయల వరకు బీమా పరిహారం కూడా లభించేదని పేర్కొన్నారు.
రూ.45 వేల వరకు..
దీనితోపాటు సున్నా వడ్డీ కింద దాదాపు 4,000 రూపాయలను కలుపుకొంటే రైతులకు ప్రతి ఎకరాకు దాదాపు 40,000 నుంచి 45,000 రూపాయల వరకు సహాయం అంది ఉండేదని అన్నారు. 2014-19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 30.85 లక్షల రైతులకు 3,411 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ మాత్రమే ఇచ్చాడని, అది కూడా రైతులు వారే ప్రీమియం కట్టారని విమర్శించారు.
పంట ప్రీమియం..
అదే తమ ప్రభుత్వ హయాంలో 2019- 24 మధ్య కాలంలో 54.55 లక్షల మంది రైతులకు 7,802 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ వచ్చిందని జగన్ గుర్తు చేశారు. అది కూడా ప్రభుత్వమే పూర్తి ప్రీమియం మొత్తాన్ని చెల్లించిందని అన్నారు. చంద్రబాబు పెట్టిన 715 కోట్ల రూపాయల బకాయిలు కూడా తమ ప్రభుత్వం కట్టిందని చెప్పారు.
అచ్చెన్న రియాక్షన్..
జగన్ చేసిన ఈ విమర్శలను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు. ఎదురుదాడికి దిగారు. బహిరంగ సవాల్ విసిరారు. టైమ్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే..అంటూ పంచ్ డైలాగ్స్ సంధించారు.
85 శాతం పూర్తి..
రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళ్దామని, తమ హయాంలో ఈ- పంట జరగలేదని నిరూపించాలని సవాల్ చేశారు. ఇప్పటికే 85 శాతం ఇ క్రాప్ పూర్తి కావస్తోందని, ఈ నెలాఖరు నాటికి నూరు శాతం పూర్తి చేసి ప్రతి గ్రామంలో సామాజిక తనిఖీ నిర్వహించి రైతులందరికీ న్యాయం చేస్తామని అన్నారు.
జీరో క్రాప్ ఇన్సూరెన్ప్
రైతు సాగు చేస్తోన్న ప్రతి వ్యవసాయ భూమిని ఈ- పంటలో నమోదు చేస్తామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. జగన్ పాలనలో ఒక్క సీజన్కు క్రాప్ ఇన్సూరెన్స్ చేయకుండా రైతులను ఇబ్బందులు పెట్టిన జగన్కు మాట్లాడే హక్కు లేదని అన్నారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను రెడ్ కార్పెట్ వేయించుకుని దూరం నుంచి చూసి వెళ్లిన జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్నారు.












Click it and Unblock the Notifications