కోరిక తీర్చలేదని గర్ల్పై దాడి: ఆ యువతి రేప్,హత్య?
గుంటూరు: తన కోరిక తీర్చలేదని యువతి పైన బ్లేడుతో దాడి చేసిన సంఘటన మార్కాపురంలో జరిగింది. టైలరింగ్ చేసుకొని జీవిస్తున్న 18 ఏళ్ల యువతి పైన అదే ప్రాంతానికి చెందిన రాడ్ బెండింగ్ వర్కర్ ఏసుపాదం తరచు వేధిస్తున్నాడు.
సోమవారం కిరాణా షాపుకు వెళ్లి వస్తున్న యువతి వెంట పడ్డాడు. తన వెంట రావాలని కోరాడు. నిరాకరించిన యువతి చేతి పైన బ్లేడుతో దాడి చేసి, గాయపర్చాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
గుంటూరు జిల్లా బాపట్ల పట్టణ శివారులోని ఆంధ్రకేసరి నగర్కు చెందిన ప్రత్యూష ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 6వ తేదీన ఉదయం కళాశాలకు వెళ్లిన బాలిక గంట వ్యవధిలోనే పది గంటల సమయానికి ఇంటికి తిరిగి వచ్చింది.
ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరు. పనుల నుండి సాయంత్రం వచ్చిన తల్లి కూతురు కోసం వెతికితే కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఆంధ్రకేసరి నగర్ వెనుక ఉన్న మార్కెట్ యార్డు ప్రహరీ పక్కన నీరు లేని గుంతలో ఓ మృతదేహాన్ని పూడ్చిన ఆనవాళ్లు కనిపించాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. గంతును తవ్వగా బాలిక ధరించిన సమదుస్తుల్లో ప్యాంటు భాగం, పాదం కనిపించాయి. క్లూస్ టీం నిపుణులను రప్పించి వెలికి తీశారు. ఆమెను ప్రత్యూషగా గుర్తించారు. ఆమె మృతదేహం కుళ్లి పోయి ఉండటంతో 13 రోజుల క్రితమే హత్య చేసి, పూడ్చి ఉంటారని చెబుతున్నారు.
ఆమె మెడకు ప్యాంటు చుట్టి ఉంది. లో దుస్తులు లేకపోవడంతో అత్యాచారం చేశాక హతమార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. మంగళవారం శవపరీక్ష నిర్వహించనున్నారు. ప్రత్యూష మూడు నెలల క్రితం ఇంట్లోంచి స్నేహితుడితో కలిసి వెళ్లిపోయిందని, అప్పట్లో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు.
ఈ విషయమై పోలీసు స్టేషన్లో కేసు నమోదై ఉంది. తాజాగా ఈ నెల 6 నుండి ప్రత్యూష కనిపించలేదు. దీంతో ఆమె స్నేహితుడు గోపిరెడ్డిని పలుమార్లు విచారించారు. అతడి ప్రమేయం లేదని తేల్చారు. కాగా, ప్రత్యూష తండ్రి అయిదేళ్ల క్రితం మృతి చెందాడు. తల్లి మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది.
ఈ నేపథ్యంలో 6న ఉదయం కళాశాలకు వెళ్లిన ప్రత్యూష ఎందుకు తిరిగి వచ్చిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోవడాన్ని అవకాశంగా తీసుకొని అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని, విషయం బయట పడకుండా చంపేసి, పాతిపెట్టి ఉంటారని భావిస్తున్నారు.