వేధింపు: ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఆత్మహత్యాయత్నం
అనంతపురం: తన అనుచరులను కౌన్సెలింగ్ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కాపు రామచంద్రారెడ్డి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్ ముందు మంగళవారం ఆందోళనకు దిగిన కాపు రామచంద్రారెడ్డి పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
గమనించిన అధికారులు రామచంద్రారెడ్డి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తన అనుచరులను కౌన్సెలింగ్ పేరుతో పోలీసులు తరచూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
తన కార్యకర్తలపై వేధింపులను తక్షణమే నిలిపేయాలని కోరుతూ ఆందోళన చేపట్టిన రామచంద్రారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారని అధికారులు చెబుతున్నారు. కాగా తాము ఎమ్మెల్యేకు సంబంధించిన కార్యకర్తలపై వేధింపులకు పాల్పడలేదని పోలీసులు చెబుతున్నారు.
ఆంధ్రాబ్యాంకులో దొంగల బీభత్సం
గుంటూరు: నగరంలోని హిందూ కళాశాల సమీపంలో ఉన్న ఆంధ్రాబ్యాంకులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగదు కౌంటర్ నుంచి రూ. 2.30 లక్షలు దొంగలు దోచుకెళ్లారు. ముసుగులు ధరించి వచ్చిన దుండగులు దొంగతనానికి పాల్పడినట్లు బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులు, బ్యాంకులోని సిసి కెమెరా ఫుటేజి పరిశీలిస్తున్నారు.