ఐదో అభ్యర్థి ట్విస్ట్, పక్క పార్టీ ఎమ్మెల్యేల తెరాస ధీమా, ఉత్తమ్ ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. ఆరు ఖాళీలు ఉండగా ఏడుగురు నామినేషన్ దాఖలు చేశారు. తెరాస బలానికి మించి ఒక అభ్యర్థిని ఎక్కువగా బరిలోకి దించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. తెరాస నుండి కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావు, యాదవ రెడ్డి, విద్యాసాగర్, బీ వెంకటేశ్వర్లు, టీడీపీ నుండి వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుండి ఆకుల లలిత నామినేషన్ వేశారు.
ఆరు స్థానాలకు ఏడుగురు పోటీలో ఉండటంతో ఎన్నిక తప్పనిసరి అవనుంది. నామినేషన్ అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు మాకు ఓటు వేస్తారని చెప్పారు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
తమకు బలం ఉన్నందునే తాము ఐదో అభ్యర్థిని బరిలోకి దించుతున్నామని చెప్పారు. వారికి ఎంత బలముందో తమకూ అంతే ఉందని జగదీశ్వర్ రెడ్డి, నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. కాగా, తెరాసకు మజ్లిస్ పార్టీ మద్దతు పలుకుతోంది.
తెరాసపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
ఐదో అభ్యర్థిచే నామినేషన్ దాఖలు చేయించిన తెరాస పైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బలం లేకపోయినా తెరాస ఐదో అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. అవినీతి రాజకీయాలకు తప్పుడు విధానాలకు ఇది మరో నిదర్శనమన్నారు. బలానికి మించి అభ్యర్థిని నిలబెట్టడం సరికాదన్నారు. కేవలం అరవై సీట్లు గెలిచి ఐదు సీట్లలో సిగ్గులేకుండా, బరితెగించి నిలుస్తోందన్నారు.
మరోవైపు, ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీడీపీ తరఫున ఎంఏ షరీఫ్, ప్రతిభా భారతిలు, బీజేపీ తరఫున సోము వీర్రాజు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గోవింద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.