చంద్రబాబుకి నాని రిటర్న్ గిప్ట్ - టచ్ లో వైసీపీ నేతలు, కీలక నిర్ణయం..!!
టీడీపీ విజయవాడ రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. ఎంపీ కేశినేని నానికి వచ్చే ఎన్నికల్లో సీటు లేదని చంద్రబాబు తేల్చేసారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయం స్వయంగా కేశినేని వెల్లడించారు. ఈ సమయంలో కేశినేని నాని తన రాజకీయ భవిష్యత్ పైన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు నానితో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి తొలి వారంలో తన నిర్ణయం ప్రకటిస్తానని నాని స్పష్టం చేసారు.
నానికి టీడీపీ షాక్ : విజయవాడ సిట్టింగ్ ఎంపీకి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వటం లేదని పార్టీ నాయకత్వం తేల్చేసింది. కొంత కాలంగా నాని వ్యవహార శైలి విజయవాడ టీడీపీలో వివాదాస్పదంగా మరింది. కేశినేని బ్రదర్స్ మధ్య వివాదాలతో పాటుగా నాని వర్సస్ టీడీపీ అన్నట్లుగా విజయవాడ లోక్ సభ పరిదిలో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఏకంగా వచ్చే ఎన్నికల్లో సీటు లేదని..పార్టీ వ్యవహారాల్లో దూరంగా ఉండాలని పార్టీ తేల్చి చెప్పింది. ఈ సమయంలో కేశినేని నాని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ నిర్ణయం పైన ఆయన స్పందించారు. గొడవలు పడటం తన తత్వం కాదని చెప్పారు. చంద్రబాబును తాను వెన్నుపోటు పొడిస్తే పెద్ద పదవిలో ఉండేవాడినని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తాను స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసారు.

కొత్త వ్యూహంతో కేశినేని : తన నిర్ణయం ఏంటో ఫిబ్రవరి మొదటి వారంలో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. ఎవరి లక్ ఎలా ఉందో ఇప్పుడే ఎలా తెలుస్తుందని పేర్కొన్నారు. తాను గొడవలు చేయాలనుకుంటే లోకేష్ పాదయాత్ర సమయంలోనే గొడవలు జరిగేవన్నారు. నాని వ్యాఖ్యలు గమనిస్తే ఆయన ఈ పరిణామం ముందుగానే అంచనా వేసినట్లు కనిపిస్తోంది. భవిష్యత్ పైన క్లారిటీతో ఉన్నారు. మీడియాకు మసాలా జరుగుతుందని నాని చెప్పుకొచ్చారు. నానికి బీజేపీ ముఖ్యులతో సత్సంబంధాలు ఉన్నా...టీడీపీ, జనసేనతో బీజేపీ కలుస్తుందనే వార్తల నేపథ్యంలో ఆ పార్టీలోకి వెళ్లే అవకాశం లేదు. పొత్తు లేకపోతే నాని బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే నానితో వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు టచ్ లో ఉన్నారు. విజయవాడ సీటు బీసీలకు ఇవ్వాలని వైసీపీ భావించినా..ఇంకా అభ్యర్దిని ఖరారు చేయలేదు.

రాజకీయంగా కీలక నిర్ణయం దిశగా : నాని తనకు సీటు లేకుండా చేయటంతో టీడీపీకి షాక్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అయితే, వైసీపీలో చేరుతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. స్వతంత్రంగా తాను పార్లమెంట్ కు పపోటీ చేయటంతో పాటుగా తన అనుచర వర్గంతో విజయవాడ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో పోటీకి సిద్దమనే సంకేతాలు ఆయన సన్నిహిత వర్గాల నుంచి అందుతున్నాయి. అదే జరిగితే టీడీపీ ఓట్ బ్యాంక్ చీలే అవకాశం ఉంది. ఇదే సమయంలో టీడీపీ నుంచి విజయవాడ లోక్ సభ సీటు కేశినేని చిన్నికి ఇస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో..కేశినేని నాని రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. టీడీపీ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications