హోదా: బీజేపీపై టిడిపి ఎంపీ సంచలనం, చంద్రబాబుకి చేరడం లేదా?
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య వివాదం సమసిపోయేలా కనిపించడం లేదు. తాజాగా టీడీపీ ఎంపీ రవీంద్ర బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఆయన అల్టిమేటం జారీ చేశారు.
ప్రత్యేక హోదా అనేది ఏపీకి సెంటిమెంటుతో కూడిన వ్యవహారమని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా కావాలని రవీంద్ర బాబు డిమాండ్ చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలు, ప్యాకేజీ, హోదా ఇవ్వకుంటే బీజేపీతో తెగతెంపులకు కూడా సిద్ధమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హోదా ఇస్తే మోడీపై వారి దాడి: బీజేపీతో దోస్తీ, జగన్ కన్ను, బాబుకు చిక్కేనా?
చంద్రబాబు దృష్టికి వెళ్లడం లేదా?
విభజన నేపథ్యంలో ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్రంతో సన్నిహితంగా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే, అప్పుడప్పుడు హామీలు నెరవేర్చడం లేదని ఆయన కూడా కేంద్రంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
అయితే, పలుమార్లు టిడిపి నేతలు బీజేపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీకి హోదా ఇవ్వకుంటే బీజేపీతో తెగదెంపులకు కూడా సిద్ధమని చెబుతున్నారు. తమకు ఏపీ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని వారు అంటున్నారు. పలువురు టిడిపి నేతలు హోదా విషయంలో బీజేపీని తప్పుబడుతూ, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవి బాబు దృష్టికి వెళ్లడం లేదా, తెలిసీ ఊరుకుంటున్నారా అనే చర్చ సాగుతోంది.