'బాబును తిడితేనే ఓట్లనుకున్న కెసిఆర్కి షాక్', జనసేన ఎదురుదాడి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తిడితేనే తెలంగాణలో ఓట్లు వస్తాయనే భ్రమలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉన్నారని, కానీ ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో అది తప్పని తేలిందని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు.
ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తనకు ఒక కన్నుపోయినా పర్వాలేదు కానీ చంద్రబాబుకు రెండు కళ్లు పోవాలని కెసిఆర్ కోరుకుంటున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజలను తిట్టడమే ప్రధాన ధ్యేయంగా కెసిఆర్ ఉన్నారని ఆరోపించారు.
కెసిఆర్ కంటే నిజాం ప్రభువులే చాలా మేలు అన్నారు. మిగులు బడ్జెట్లో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ ఉందని చెప్పారు. అటువంటి మిగులు బడ్జెట్తో తెలంగాణలో అద్భుతాలు సృష్టించవచ్చునని చెప్పారు. కెసిఆర్ మాత్రం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో పని చేస్తున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని కెసిఆర్ బ్యూరోగా మార్చారని మండిపడ్డారు. ఏసీబీని చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు.
మరోవైపు, జనసేన పార్టీ కార్యకర్తలు కేశినేని నాని, టీడీపీపై ఎదురు దాడికి దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కేశినేని నాని పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications