ఉద్రిక్తత: వైద్య పరీక్షలకు నో, ముద్రగడ ఇంటిని చుట్టుముట్టిన సిఆర్పిఎఫ్
కాకినాడ/ గుంటూరు: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం, ఆయన సతీమణి దీక్ష చేస్తున్న కిర్లపూడిలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. వైద్య పరీక్షలకు ముద్రగడ పద్మనాభం నిరాకరిస్తున్నారు. వైద్యులను తీసుకుని జాయింట్ కలెక్టర్ ఆయన ఇంటికి వచ్చారు.
అయితే, ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు నిరాకరిస్తూ ఇంటి తలుపులు వేసుకున్నారు. ఆయన ఇంటిని సిఆర్పిఎఫ్ దళాలు చుట్టుముట్టాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముద్రగడ ఇంటి తలుపులు తెరవడానికి పోలీసులు విఫలయత్నం చేశారు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో వైద్యులు వెనుదిరిగారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో శనివారం జరిపిన చర్చలు విఫలమైనట్లు ముద్రగడ తెలిపారు. చర్చల అనంతరం ఆయన శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం ఒక్క మెట్టు కూడా దిగిరాదంటా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తన జాతి కోసం పోరాడుతానని ఆయన చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఉదయం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే.
అంబటి రాంబాబు వినూత్న నిరసన
బీసీ రిజర్వేషన్ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభానికి మద్దతుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర ప్రతినిధి అంబటి రాంబాబు శనివారం తన నివాసంలో వినూత్న నిరసన తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్నం భోజనం మానివేసి భోజనం ప్లేటుపై గరిటతో గంట మోగిస్తూ నిరసన తెలిపారు.
కాపులు కంచాల కోసం పోరాటం చేస్తూంటే, టీడీపీ నాయకులు లంచాల కోసం ఆరాటపడుతున్నారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. అధికారంలోకి రాగానే కాపులను బీసీల్లోకి చేర్చుతానని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నిండా మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు.
కాపు కార్పొరేషన్కు ఏటా వెయ్యి కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి, రూ. 100 విదిలించారని విమర్శించారు. రిజర్వేషన్ పేరుతో మరో వైపు కాపులు, బీసీల మధ్య చిచ్చుపెడుతున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications