ప్రభుత్వ ప్రతినిధులతోనే చర్చలు, వచ్చారు గానీ చెప్పను: ముద్రగడ
కాకినాడ: తాను చర్చలకు సిద్ధంగానే ఉన్నానని, అయితే ప్రభుత్వ ప్రతినిధులతో మాత్రమే చర్చలు చేస్తానని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చెప్పారు. తన సతీమణితో సహా తాను రేపు శుక్రవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
తన తరఫున చర్చలకు ఎవరూ వెళ్లలేదని, చర్చలతో తన జాతికి మేలు జరుగుతుందని భావిస్తే తాను సిద్ధమేనని ఆయన అన్నారు. ఏడాదికి వేయి కోట్ల చొప్పున కాపుల సంక్షేమానికి రెండేళ్లకు రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంజునాథ్ కమిషన్ గడువును కుదించాలని కూడా ఆయన కోరారు.

తనతో అనధికారికంగా చర్చలు చేశారని, అయితే వారి పేర్లను గానీ అందుకు సంబంధించిన వివరాలను గానీ చెప్పడం భావ్యం కాదని ఆయన అన్నారు. తన దీక్షా స్థలికి తండోపతండాలుగా ఎవరూ రావద్దని ఆయన కోరారు. రేపు ఉదయం పూట ఇంటి ముందు వీధుల్లో చప్పుడు చేసి అందరికీ విషయం తెలిసేలా చేస్తే చాలునని, అదే విధంగా మధ్యాహ్నం భోజనం మానేసి మన ఆకలిని ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన అన్నారు.
తన దీక్షాస్థలికి పెద్ద యెత్తున కదిలి వస్తే విమర్శలకు తావు కల్పించినవాళ్లమవుతామని ఆయన చెప్పారు. ఇది ఆఖరిపోరాటమని చెప్పారు. ఎవరూ ఆవేశానికి వెళ్లి ఆత్మహత్యల వంటి సంఘటనలకు పాల్పడవద్దని ఆయన కోరారు వెంకటరమణమూర్తి ఆత్మహత్య బాధ కలిగించిందని చెప్పారు.
మీడియావారు తనకు ఎంతో సహకరించారని, వారందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానని ముద్రగడ అన్నారు. టీవీ, పత్రికలు చూసే వెసులుబాటు గత వారం రోజులుగా తనకు లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications