అయ్యయ్యో బ్రహ్మయ్యా..: జయలలిత మృతిపై ఆవేదనగా మురళీ మోహన్
ముఖ్యంగా అమ్మ క్యాంటీన్, అమ్మ ఉప్పు, వైద్యం.. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, అలాంటి జయ లేరంటే ఇప్పుడు చాలా బాధగా ఉందని మురళీ మోహన్ అన్నారు.
విజయవాడ: జయలలిత మృతి పైన తెలుగుదేశం పార్టీ ఎంపీ మురళీ మోహన్ మంగళవారం నాడు స్పందించారు. పేద ప్రజల కోసం ఆమె తమిళనాడులో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కితాబిచ్చారు.
జయ మృతి: పన్నీరు సెల్వం వెనుక శశికళ, అప్పుడే పట్టు కోసం పావులు?
ముఖ్యంగా అమ్మ క్యాంటీన్, అమ్మ ఉప్పు, వైద్యం.. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, అలాంటి జయ లేరంటే ఇప్పుడు చాలా బాధగా ఉందన్నారు. తెలుగు సినిమా రంగంలో ఒక వ్యక్తిగా, తెలుగు సినీ రంగం తరఫున, అలాగే ఏపీ ప్రభుత్వం తరఫున నివాళులు అర్పిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఆవేదనగా.. అయ్యయ్యో బ్రహ్మయ్యా.. అన్యాయం చేశావేమయ్యా.. జయలలితను అప్పుడే తీసుకెళ్లిపోయావేమయ్యా అని పాడుతూ.. అయ్యయ్యో బ్రహ్మయ్య పాటను గుర్తు చేశారు.
సినీ, రాజకీయ ప్రస్థానాల్లో జయలలిత చిరస్థాయిగా నిలిచిన ధీరవనిత అని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. జయకు సంతాపం తెలిపారు.
తమిళనాట ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో శాశ్వతమైన ముద్రవేసిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. జయతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రజాశక్తితో తిరుగులేని మహా నాయకురాలిగా జయ వెలుగొందారన్నారు.