శిల్పామోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు
కర్నూలు: మాజీ మంత్రి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డిపై కర్నూలు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ దేశం సులోచన తోపాటు మో ముగ్గురు కౌన్సిలర్లపైనా కేసులు నమోదయ్యాయి. కోర్టు ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసినట్లు కర్నూలు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు మాజీ కౌన్సిలర్లపైనా కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
ఇటీవల నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో దాడి ఘటనపై కర్నూలు కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదైంది. కౌన్సిల్ సమావేశంలో గొడవ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలపై కేసు నమోదు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పక్షపాతంతోనే తమపై కేసులు నమోదు చేశారని, తెలుగుదేశం నేతలపై కూడా కేసులు నమోదు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన కోర్టు శిల్పామోహన్ రెడ్డి, నంద్యాల కౌన్సిల్ ఛైర్ పర్సన్, మరో ముగ్గురు కౌన్సిలర్లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో శిల్పా మోహన్ రెడ్డి, తదితరులపై కేసు నమోదైంది.
ఇటీవల అరెస్టైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
సచివాలయం ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట బుధవారం ఓ యువకుడు ఆత్యహత్యాయత్నం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వీఆర్వో పరీక్షలో తనకు అన్యాయం జరిగిందన్న బాధతో అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. ప్రస్తుతం అతడు సైఫాబాద్ పోలీసుల అదుపులో ఉన్నాడు.