జనసేన వచ్చిందిగా!: మైసూరా ఆసక్తికరం, ప్రత్యేక సీమపై షాకింగ్ కామెంట్స్
అమరావతి: సీనియర్ రాజకీయ నాయకులు మైసూరా రెడ్డి బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన పాల్వంచకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ప్రత్యేక హోదా విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మైసూరా.. 2019 ఎన్నికలకు ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారిపోనున్నాయని, అందుకు జనసేన పోటీ చేయనుండటమే కారణమని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక సీమ సాధనకు ఆయన అనుకూలంగా ఉన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం నిర్లక్ష్యం
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని మైసూరా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా తెలంగాణకు అన్యాయమే జరిగిందని ఆయన వాపోయారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్తో కలిసి మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ వచ్చాడు.. మారనున్న ముఖచిత్రం
ఏపీలో నిన్నటి వరకు కాంగ్రెస్, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో తెరపైకి వచ్చారని మైసూరా రెడ్డి గుర్తు చేశారు. దీంతో ఏపీ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక రాయలసీమ సాధనకు నేను మద్దతిస్తా
ఏపీలో 23 శాతం మేర కాపులు ఉన్నారని మైసూరా రెడ్డి చెప్పారు. వారు కూడా అధికారం కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాయలసీమ సాధన కోసం ఎవరు పోరాడినా తాను మద్దతు ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాయలసీమ నినాదాన్ని ఇటీవల తెరపైకి తీసుకు వచ్చింది. ప్రత్యేక సీమ సాధనకు తాను మద్దతిస్తానని మైసూరా ప్రకటించడం గమనార్హం.

మైసూరా అటు అడుగులు వేస్తున్నారా?
కాగా, మైసూరా రెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే జనసేన వైపు అడుగులు వేసే ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ సాగుతోంది. మైసూరా చాలాకాలం పాటు కాంగ్రెస్లో పని చేశారు. ఆ తర్వాత టీడీపీలో, వైసీపీలో కొంతకాలం ఉన్నారు. కొంతకాలం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను ఆరు నెలల్లో ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరుతానని ప్రకటించారు.

గూడార్థం! ఆ వ్యాఖ్యల్లోని గూడార్థం!
కడపలో వైసీపీ అధినేత వైయస్ జగన్పై పైచేయి కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అవసరమైతే మైసూరాను తిరిగి తీసుకునే అవకాశాలు లేకపోలేదని భావించారు. పదవులపరంగా సముచిత స్థానం కూడా కల్పించేందుకు సిద్ధమైనట్లుగా ప్రచారం సాగింది. అయితే, ఇప్పుడు జనసేన ఎంట్రీతో సీన్ మారిందని, దీంతో ఆయన ఎటు చూస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. జనసేనతో ముఖచిత్రం మారనుందని, కాపులు అధికారం కోరుకుంటున్నారనే వ్యాఖ్యల ద్వారా ఆయన పవన్ వైపు అడుగులేస్తున్నారా అనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications