ఎపి ప్రభుత్వానికి నాబార్డ్ షాక్:నిధులిచ్చి ఇంతకాలమైనా పనులు మొదలెట్టరా?...వెనక్కి తీసేసుకుంటాం
అమరావతి:వందలాది పనులకు నిధులు మంజూరు చేసి రెండేళ్లు గడుస్తున్నా ఒక్కపని కూడా ప్రారంభించలేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నాబార్డ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిధులిచ్చినా పనులు ఎందుకు ప్రారంభించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని నాబార్డ్ ప్రశ్నించింది. తక్షణం పనులు ప్రారంభించి వాటి వివరాలు తమకి పంపించకపోతే మంజూరు చేసిన నిధులను వెనక్కి తీసుకుంటామని నాబార్డ్ హెచ్చరించింది. ఈ మేరకు నాబార్డు నుండి రాష్ట్ర ఆర్థికశాఖకు అందిన లేఖ ఎపి ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే...

నాబార్డు రుణం...వివరాలు
రెండు సంవత్సరాల క్రితం ఆర్ఐడిఎఫ్ 21, ఆర్ఐడిఎఫ్ 22 క్రింద 115 పనులకు రుణాలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాబార్డుకు ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిశీలించిన నాబార్డు ఆయా పనుల నిమిత్తం 350 కోట్ల రూపాయల రుణాన్ని కేటాయించింది. అయితే ఈ పనులను కనీసం 18 నెలల్లో ప్రారంభించాలని ఆ సందర్భంలో నాబార్డ్ రాష్ట్ర ప్రభుత్వానికి షరతు విధించింది. అంతేకాకుండా నిర్ధేశించిన విధంగా పనులను చేపట్టలేకపోతే మంజూరు చేసిన రుణాన్ని రద్దు చేస్తామని అప్పుడు పేర్కొవడం జరిగింది.

ఆ శాఖ లోనే...ఎక్కువ పనులు
అలా నాబార్డ్ నిధులు కేటాయించిన పనుల్లో...ఒక్క పంచాయతీ రాజ్శాఖలోనే 31 పనులకు రుణం ఇవ్వగా...గిరిజన సంక్షేమశాఖకు 14 పనులు...వ్యవసాయశాఖకు 14 పనులకు కూడా రుణాలను మంజూరు చేసింది. అదేవిధంగా గ్రామీణాభివృద్ది శాఖ కూడా కొన్ని పనులకు రుణం తీసుకుంది. అయితే ఇలా రుణం కోసం ధరఖాస్తు చేయడానికి అత్యంత ఆసక్తి చూపిన ప్రభుత్వం, ఆయా శాఖలు...ఆ తరువాత పనుల ప్రారంభం విషయానికొచ్చేసరికి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని నాబార్డ్ అసహనం వ్యక్తం చేసింది. కాబట్టే నిధులు మంజూరు అయిన 115 పనుల్లో ఒక్కటి కూడా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదని స్పష్టం చేస్తోంది.

అభివృద్ది లేక...ప్రజలకు నష్టం
ప్రధానంగా సాధారణ ప్రజానికానికి అవసరమయ్యే పంచాయితీరాజ్, గ్రామీణా భివృద్ధిలో ఆయా పనులు చేపట్టకపోవడం వల్ల అభివృద్ది పరంగా ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ప్రజాసంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అమలు చేయాల్సిన పనుల్లో కొన్ని రోడ్లు, చిన్న చిన్న వంతెనలు కూడా ఉండగా...వాటి నిర్మాణం వల్ల అక్కడి ప్రజలకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉన్నా ఆయా శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై నాబార్డ్ ఘాటుగా ప్రతిస్పందించింది. వీటిపైనా సంబంధిత శాఖతోపాటు, ఐటిడిఎలు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నట్లు స్పష్టమవుతున్నట్లు నాబార్డ్ తేల్చేసింది.

తుది హెచ్చరిక...కలకలం
ఈ క్రమంలో ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ నాబార్డు అధికారులు సంబంధిత శాఖలకు గతంలోనే ఒక లేఖను రాసిన్పటికీ ఆయా శాఖల నుంచి కనీస స్పందన కరువవడంతో తాజాగా మరింత ఘాటుగా రాష్ట్ర ఆర్థికశాఖకు మరో లేఖను పంపారు. సోమవారంలోగా తాము నిధులు మంజూరు చేసిన 115 పనుల వివరాలను తమకు పంపించాలని, లేనిపక్షంలో వాటిని రద్దు చేస్తామని తుది హెచ్చరిక చేశారు. నిర్ణీత గడువులోగా పనులు ప్రారంభించకపోతే నిధులను వెనక్కి తీసుకుంటామన్న షరతును తాము ముందుగానే పెట్టిన విషయాన్ని నాబార్డు ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఆ మేరకు రాతపూర్వకంగా కూడా జరిగిన ఒప్పందం గురించి హెచ్చరించింది. ఇంత కచ్చితమైన నిబంధన, ఒప్పందం ఉన్నప్పటికీ ఎపి అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల నాబార్డు విస్మయాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు నాబార్డ్ తీవ్ర హెచ్చరికలతో కూడిన తాజా లేఖ ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications