నాగార్జున ఫ్యాన్స్ ఆందోళన: ఇద్దరు ఆత్మహత్యాయత్నం
కర్నూలు: కర్నూలులోని ఆనం థియేటర్ వద్ద మంగళవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తెలుగు సినీ హీరో అక్కినేని నాగార్జున అభిమానులు ఆందోళనకు దిగారు. అఖిల్ సినిమా టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్నారని వారు సినిమా థియేటర్ వద్ద ఆందోళనకు దిగారు.
నాగార్జున అభిమానులు ఇద్దరు తమ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరిని పోలీసు స్టేషన్కు తరలించారు. అఖిల్ సినిమా ద్వారా నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని సినీ రంగంలోకి ప్రవేశిస్తున్నారు.
అఖిల్ సినిమా బుధవారంనాడు విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా థియేటర్లు టికెట్లను అడ్వాన్స్గా విక్రయిస్తున్నాయి. ఈ స్థితిలోనే ఆనం థియేటర్ వద్ద నాగార్జున అక్కినేని అభిమానులు ఆందోళనకు దిగారు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యువనటుడు నితిన్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై నిర్మించారు.
అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.