నంద్యాల పోరు: జగన్ భయాలు ఇవీ... విజయంపైనే.
నంద్యాల అసెంబ్లీ స్థానంలో విజయం చంద్రబాబు కన్నా వైయస్ జగన్కు ముఖ్యం.నంద్యాల ఫలితం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఏదో మేరకు ప్రభావం చూపుతుంది.
కర్నూలు: నంద్యాల అసెంబ్లీ స్థానంలో విజయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడి కన్నా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు ముఖ్యం. నంద్యాల ఫలితం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఏదో మేరకు ప్రభావం చూపుతుంది.
నంద్యాలలో విజయం సాధిస్తే పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఉత్సాహం ఇనుమడిస్తుంది. దానివల్ల వచ్చే ఎన్నికలకు మరింత విశ్వాసంతో ముందుకు సాగడానికి జగన్కు అవకాశం ఉంటుంది.
పరాజయం పాలైతే మాత్రం తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఆయన నాయకత్వంపై విశ్వాసం సడలే అవకాశం కూడా ఉంది. నాయకులూ కార్యకర్తలూ పక్కచూపులు చూసినా ఆశ్చర్యం లేదు. నిజానికి, నంద్యాల ఉప ఎన్నిక ఇరు పార్టీల మధ్య హోరాహోరీగానే ఉంది.
అటు నుంచి ఇటు...
నంద్యాల శాసనసభ సీటు తనకు ఇవ్వాలని పట్టుబట్టి విఫలమై తెలుగుదేశం పార్టీని వీడి శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు. అక్కడ దక్కని టికెట్టును ఆయన జగన్ వద్ద సంపాదించుకున్నారు. నంద్యాలలో విజయం సాధించడం జగన్కే కాదు, శిల్పా మోహన్ రెడ్డికి కూడా అత్యంత కీలకం. సవాల్ చేసి బరిలోకి దిగిన తర్వాత విజయం దక్కకపోతే స్థానికంగా ఆయన దెబ్బ తినే ప్రమాదం ఉంది. పార్టీ మారిన నాయకుడికి టికెట్ ఇచ్చి సవాల్ చేసిన విజయం సాధించలేకపోతే జగన్ వ్యూహాలకు కూడా దెబ్బ తగులుతుంది.
Recommended Video
వచ్చే ఎన్నికలకు ముఖ్యం....
నంద్యాలలో విజయం సాధించడం జగన్కు అత్యంత ముఖ్యం. అది నైతిక బలాన్ని చేకూరుస్తుంది. వచ్చే సాధారణ ఎన్నికలను విశ్వాసంతో ఎదుర్కోవడానికి అవసరమైన మనో ధైర్యాన్ని అది సమకూరుస్తుంది. లేదంటే, తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడి, కొంత ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అది పాటించి....
తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన శిల్పా చక్రపాణి రెడ్డి విషయంలో జగన్ నైతిక విలువలను పాటించారనే మాట వినిపిస్తోంది. ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తే తప్ప చేర్చుకోనని ఆయన షరతు పెట్టారు. రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకుంటే చంద్రబాబు చేసిన పొరపాటే జగన్ చేశారనే అభిప్రాయం ప్రజల్లో నాటుకునే అవకాశం ఉంది. ఇద్దరూ ఇద్దరే అనుకునే ప్రమాదం కూడా ఉండేది. ఆ మేరకు జగన్ కొంత వరకు స్థయిర్యాన్ని ప్రోది చేసుకున్నారనే చెప్పాలి.
చంద్రబాబు బలపడిపోతారు...
నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే చంద్రబాబు మరింతగా జగన్పై విమర్సలు కురిపించే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం నాయకులు తమకు తిరుగులేదనే భావనతో వైసిపిపై విరుచుకుపడే అవకాశం ఉంంటుంది. ఇది జగన్కు కష్టాలు తెచ్చిపెట్టడం ఖాయం. వైసిపి నుంచి మరింత మందిని తమ పార్టీలోకి తెలుగుదేశం నాయకులు ఆహ్వానించే అవకాశం కూడా ఉంటుంది. ఆ రకంగా జగన్ను బలహీనపరచడానికి వారికి నంద్యాల విజయం ఉపయోగపడుతుంది.