మరో కేసులో చంద్రబాబు, సీఐడీ తాజా పిటీషన్ - ఉక్కిరి బిక్కిరి..!!
తెలుగు దేశం అధినేత చంద్రబాబు పై మరో కేసు విచారణకు రంగం సిద్దం అవుతోంది. ప్రస్తుతం స్కిల్ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబును అమరావతి కేసులో విచారణకు వీలుగా పీటీ వారెంట్ ఇవ్వాలని కోరుతూ సీఐడీ మరో పిటీషన్ దాఖలుకు సిద్దమైనట్లు సమాచారం. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సమయంలోనే ఈ కేసులోనూ విచారణకు అనుమతి ఇవ్వాలని సీఐడీ కోరుతున్నట్లు విశ్వస నీయ సమాచారం.
మారుతున్న లెక్కలు:ఏపీలో రాజకీయ లెక్కలు వేగంగా మారుతున్నాయి. స్కిల్ స్కాంలో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు మరో కేసు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ను స్కిల్ స్కాం కేసులో తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పైన విచారణ జరిగింది. ఇదే సమయంలో సీఐడీ మరో పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో చంద్రబాబును విచారించేందుకు వీలుగా పీటీ వారెంట్ ఇవ్వాలని అందులో కోరినట్లు సమాచారం. 2022లో నమోదైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ చంద్రబాబుపైన అభియోగాలు నమోదు చేసింది. ఆ కేసు లో విచారణకు ఇప్పుడు సీఐడీ సిద్దం అవుతోంది.

సీఐడీ మరో అడుగు:స్కిల్ స్కాంలో కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లటంతో ఇదే సమయంలో ఇతర కేసులను తెర మీద తెచ్చేందుకు పావులు కదులుతున్నట్లు తెలుస్తోది. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న చంద్రబాబును ఇతర కేసుల్లోనూ విచారణ చేయాలని సీఐడీ భావిస్తోంది. అందులో భాగంగానే పీటీ వారెంట్ కోరుతూ తాజాగా పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అటు చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ రిపోర్టు కాపీ పైన అధ్యయనం చేస్తున్నారు.
స్కిల్ స్కాంలో చంద్రబాబు కేసు వాదించిన న్యాయవాది సిద్దార్ధ లూద్రా ఈ కాపీలోని అంశాలను ప్రస్తావిస్తూ హౌస్ అరెస్ట్ లో ఉండేలా అవకాశం ఇవ్వాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అదే సమయంలో చంద్రబాబు బెయిల్ పిటీషన్ దాఖలు పైనా కసరత్తు జరుగుతోంది.

చంద్రబాబును విచారిస్తారా:చంద్రబాబును హౌస్ అరెస్ట్ కు అవకాశం ఇవ్వాలనే పిటీషన్ పైన సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ సమయంలోనే సీఐడీ అమరావతి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ కేసులో చంద్రబాబును విచారించటం ద్వారా పలు విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతోంది. చంద్రబాబు స్కిల్ స్కాం మాత్రమే కాదని, పలు కేసుల్లో ఉన్నారని..అన్నీ విచారణకు వస్తాయంటూ వైసీపీ నేతలు వరుసగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
అందులో అమరావతి కేసు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ సమయంలోనే సీఐడీ పీటీ వారెంట్ కోరుతూ పిటీషన్ దాఖలు వ్యవహారంతో...ఇప్పుడు ఇది రాజకీయంగా కలకలంగా మారుతోంది. వరుస కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతారా..సీఐడీ పిటీషన్ పైన న్యాయస్థానం ఏం చెప్పబోతున్నదనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications