చంద్రబాబు పనిని జగన్ చేస్తున్నారు, ఆరునూరైనా తగ్గేది లేదు: బొత్స
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయవలసిన పనిని తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ గురువారం నాడు అన్నారు.
ఆరు నూరు అయినా వైయస్ జగన్ దీక్ష కొనసాగుతుందని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ పోరాటం చేస్తున్నారన్నారు. వాస్తవంగా ఈ పనిని చంద్రబాబు చేయాలన్నారు.
రాజకీయాలు, వ్యాపారాల కోసం కేంద్రంతో చంద్రబాబు లాలూచీ పడ్డారని ఆరోపించారు. దీక్ష కోసం తాము మొదట మూడు ప్రాంతాలు చూపించామని, అయినా వాటిని కాదన్నారన్నారు. నాలుగు దీక్షా స్థలికి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు.
ప్రస్తుత మైదానంలోనే అనేకసార్లు ఎగ్జిబిషన్లు జరిగాయన్నారు. అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడెందుకో చెప్పాలన్నారు. పోలీసుల నిబంధనలకు లోబడి తాము తలపెట్టిన (ఉల్ఫ్ హాల్ మైదానం) గ్రౌండులోనే దీక్ష నిర్వహిస్తామన్నారు. పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు.
కలిసి పోరాడుదాం: భూమా నాగిరెడ్డి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రతి ఒక్కరు శ్రమించాలని, అందుకోసం జగన్ ఆధ్వర్యంలో జరిగే పోరాటానికి మద్దతుగా నిలవాలని వైసిపి నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చెప్పారు. పోరాటంలో విద్యార్థులు ముందుండాలన్నారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందన్నారు.